దుబాయ్: యునైటెడ్ ఎమిరేట్స్లో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ జాక్పాట్ కొట్టింది. అజ్మన్లోని ఒక స్కూలులో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఆ మహిళకు 10 లక్షల అమెరికన్ డాలర్ల లాటరీ తగిలింది. యుఎఇలో చాలాకాలం నుంచి నివసిస్తున్న మాలతీ దాస్ అజ్మన్లోని భారతీయ హైస్కూలులో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్న ఆమె జూన్ 26న ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని టెర్మినల్ 2లో లాటరీ డ్రా నిర్వహించగా దాస్కు బంపర్ బహుమానం లభించింది. లాటరీలో తనకు 10 లక్షల డాలర్ల ప్రైజు లభించడం ఆనందంగా ఉందని మాలతీ దాస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇది గొప్ప వరమని, ఈ డబ్బును సత్కార్యానికి ఉపయోగిస్తానని ఆమె పేర్కొన్నట్లు గల్ఫ్ న్యూస్ గురువారం తెలిపింది. తాను ప్రస్తుతం పనిచేస్తున్న స్కూలు అభివృద్ధికి కొంత మొత్తాన్ని వినియోగిస్తానని ఆమె చెప్పారు.
1999లో ఈ లాటరీలు మొదలు పెట్టినప్పటి నుంచి 10 లక్షల డాలర్లు గెలుచుకున్న భారత జాతీయులలో మాలతీ దాస్ 165వ వ్యక్తని లాటరీ నిర్వాహకులు తెలిపారు. దాస్కు ముందు యుఎఇలో నివసిస్తున్న భారత జాతీయుడు డిక్సన్ కట్టిహర అబ్రహం గతనెల జరిగిన లాటరీ డ్రాలో ఒక కోటి దినారాల బహుమానాన్ని గెలుచుకున్నారు. ఏప్రిల్లో జరిగిన డ్రాలో దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక భారతీయుడు ఒక కోటి 20 లక్షల దినారాల లాటరీ కొట్టేశాడు. ఈ ఏడాది జనవరిలో మరో భారతీయుడు ఒక కోటీ 20 లక్షల దినారాల ప్రైజ్ మనీ పట్టేశాడు. గత ఏడాది అక్టోబర్లో అబుదాబీలో జరిగిన బంపర్ డ్రాలో 10 లక్షల దినారాల బహుమానాన్ని విడివిడిగా గెలుచుకున్న 10 మందిలో 8 మంది భారతీయులే కావడం విశేషం.
Indian Woman wins 1 million US dollars lottery in UAE