ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావంకన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరితం బలంగా పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ తమను తాము కాపాడుకోవడంలో బిజీగా ఉంటే భారత్ మాత్రం సంస్కరణలు చేపట్టడంలో నిమగ్నమైందని ఆయన చెప్పారు. ‘ కొవిడ్19 భారత్ సహా ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలపైనా ప్రభావం చూపించింది. అయితే మన ఆర్థిక వ్యవస్థ కొవిడ్ సమయంలో ఆగిపోయినదానికన్నా మరింత బలంగా కోలుకుంది’ అని అహ్మదాబాద్లో ఉద్యోగార్థులకు శిక్షణ అందించడం కోసం ఏర్పాటు చేసిన సరార్ ధామ్ భవన్ కాంప్లెక్స్ను శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ఆహూతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని అన్నారు. ‘కరోనా విజృంభణ సమయంలో ప్రపంచంలోని బడా ఆర్థిక వ్యవస్థలన్నీ తమను తాము కాపాడుకోవడంలో బిజీగా ఉంటే మనం మాత్రం సంస్కరణలను కొనసాగించాం. అంతర్జాతీయ సప్లై చైన్కు ఆటంకాలు ఎదురైనప్పుడు భారత్కు అనుకూలంగా కొత్త అవకాశాలను మార్చడం కోసం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని( పిఎల్ఐ)ని మనం ప్రవేశపెట్టాం’ అని ప్రధాని చెప్పారు. ఈ పథకాన్ని ఇప్పుడు టైక్స్టైల్ రంగానికి కూడా పొడిగించడం జరిగిందని ఆయన చెప్తూ, టైక్స్టైల్ రంగం, సూరత్ లాంటి నగరాలు ఈ పథకం ద్వారా గరిష్ఠ స్థాయిలో ప్రయోజనం పొందాలని ప్రధాని సూచించారు.