పార్టీ అధికార ప్రతినిధి పదవికి ఇందిరా శోభన్ రాజీనామా
లోటస్పాండ్లో షర్మిలతో భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని లోటస్పాండ్లో బుధవారం నాడు వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ కలిశారు. షర్మిల పార్టీకి అధికార ప్రతినిధిగా ఇందిరా శోభన్ వ్యవహరించనున్నారని, ఆమె బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపారు. రెండు రోజుల క్రితమే షర్మిల అనుచరులతో ఇందిరా శోభన్ సమావేశం అయ్యారు.తన పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఇందిరా ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని చెప్పారు. తెలంగాణ బిడ్డగా కాంగ్రెస్కు అండగా నిలిచేందుకు పార్టీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్లో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని రాజీనామా లేఖలో తెలిపారు.
కొన్ని రోజులుగా పార్టీలోని సీనియర్ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనను కలిసివేసిందని చెప్పారు. పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లేఖలో ఇందిరా శోభన్ తప్పుబట్టారు. ఇదిలావుండగా వైఎస్ షర్మిల పార్టీ నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలోని కులసంఘాలు, యువజన, విద్యార్థి సంఘాల నేతలను కలుస్తూ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నల్లగొండ, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల సమావేశాలు నిర్వహించారు. మహబూబ్నగర్ పోగా మిగిలిన ఆరు జిల్లాల ఆత్మీయ సమావేశాలు ఏప్రిల్ 10లోపునే పూర్తి కానున్నాయి. చివరి ఆత్మీయ సమావేశం ఏప్రిల్ 9న ఖమ్మంలో జరగనుంది. ఈ నెల 1న లోట్సపాండ్లో పలు కుల సంఘాల నేతలు, ముస్లిం మైనార్టీలు షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.
షర్మిలను కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో ఆర్థికంగా లబ్ధి పొందామని షర్మిలను కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో వైఎస్ షర్మిలతో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సురేందర్బాబు, ఇతర నేతలు భేటీ అయ్యారు. ముదిరాజ్ల సమస్యలు,రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై షర్మిలతో చర్చించినట్లు సురేందర్ బాబు తెలిపారు. భవిష్యత్లో ముదిరాజ్ సంఘం నుంచి సలహాలు సూచనలు తీసుకుంటానని షర్మిల చెప్పారని పేర్కొన్నారు.