మన తెలంగాణ/హైదరాబాద్: మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రైతులకు అలాంటి పంటలు పండించేందుకు ప్రోత్సాహించాలన్నారు. ముందు తరాలు అన్నం తిని ఎక్కువ సంవత్సరాలు జీవించారని, ఇప్పటి తరం అన్నంతో మధుమేహం వస్తుందని రైస్కు దూరంగా ఉంటున్నారన్నారు. వరి వంగడాలను శాస్త్రీయంగా పరిశోధించి, వాటిలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని గవర్నర్ కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్భవన్ నుంచి గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా అనే ప్రత్యేక వెరైటీని ప్రోత్సాహించడం ద్వారా యువతను కూడా అన్నానికి దగ్గర చేయవచ్చునన్నారు. తాటి చెట్టు తరతరాలుగా మన పూర్వీకులు కల్పవృక్షంగా భావిస్తున్నారని, ఆ చెట్టు ప్రతి భాగం కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్నారు.
ఇప్పుడు ఆ చెట్లను కాపాడుకోవడంతో పాటు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నీరా పానీయం ఎంతో పోషకాహార విలువలు కలిగి ఉందని ఈ పానియాన్ని ఎక్కువ కాలం పోషక విలువలు పోకుండా నిల్వ ఉంచే విధంగా పరిశోధనలు జరగాలన్నారు. తాటి చెట్లు ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేసే కుటీర పరిశ్రమలు తమిళనాడు, కేరళలో ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నాయన్నారు. అనారోగ్యకరమైన కొన్ని వంట నూనెలతో అనేక రోగాలు మొదలవుతున్నాయన్ని ఒక డాక్టర్గా తన అన అనుభవంలో గమనించినట్లు గవర్నర్ తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన వంటనూనెల ఉత్పత్తిలో విస్తృత పరిశోధనలు జరగాలని వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ పరిశోధకులకు సూచించారు.
Intensified Research on Immunity boosting crops:Governor