*ఉమ్మడి జిల్లాల్లో పరీక్షలకు హాజరు కానున్న 70,547 మంది విద్యార్థులు
*నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
*పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
*ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
*ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్న పోలీసులు
ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై మార్చి 16వరకు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 21,188మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 14,361 మంది, నల్లగొండ జిల్లాలో 34,998 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీటి నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మన తెలంగాణ/సూర్యాపేట: ఈ ఏడాది పరీక్షల కాలం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే నేటి నుంచి జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులయ్యారు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 పరీక్ష కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ప్లైయింగ్ స్కాడ్, ఇన్వీజిలేటర్ల బృం దాల నియామకం చేపట్టినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నా రు. ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి నుండి మార్చి 16 వరకు జరగనున్నాయి. ఉద యం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. వీటిలో ప్రథమ సంవత్సరం 8,887 మంది, ద్వితీ య సంవత్సరం 11,227 మం ది, ఒకేషనల్ కోర్సు, 1071 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ, వొకేషనల్ పరీక్షలు రాయనున్న 21,185 మంది విద్యార్థుల కోసం 38 కేంద్రాలను గుర్తించారు. ఈ సారి పక్కా భవనాలు, అన్ని వసతులు కలిగిన కళాశాలలనే కేంద్రాల కోసం ఎంపిక చేశారు. ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చోకుండా బేంచీలను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, విద్యుత్తు సౌకర్యం, వైద్య, ఆరోగ్య సిబ్బంది తాగునీరు ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
మాస్ కాపీయింగ్కు పకడ్బందీ చర్యలు
పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతి ఇస్తారు. తొలిసారిగా సీఎస్, డీఓలకు కూడా ఫోన్లను వాడే అవకాశం ఇవ్వలేదు. మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తే వారిపై చర్యలు ఉంటాయి. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
20 మంది విద్యార్థులకు ఒక ఇన్వీజిలేటర్
ప్రతి సెంటర్లో 20 మంది విద్యార్థులకో ఇన్వీజిలేటర్ను నియమించారు. 38 సెంటర్లలో 38 మంది చీఫ్ సూపరిండెంట్లు, 38 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. రెండు ప్లైయింగ్ స్కాడ్ టీమ్లు, ఆరుగురు సిట్టింగ్ స్కాడ్లను నియమించారు. వీరు కాక ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఎంపిడిఓలు ప్లైయింగ్ స్కాడ్ల టీమ్లో ఉంటారు. ఇంకా అవసరమైతే మరో 15 మందిని సిట్టింగ్ స్కాడ్లను నియమించనున్నారు. కళాశాలల్లో పని చేసే అధ్యాపకులు కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇన్వీజిలేటర్లు నియమించారు.
నిఘా నీడలో పరీక్ష
ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. కొన్ని కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అన్ని గదులకు సీసీ కెమెరాలు లేవు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నాపత్రాల సంచులను తెరుస్తారు. జవాబు పత్రాలను సీల్ చేస్తారు. ఇదంతా ఐదు రోజులకోసారి సీడీలో రికార్డు చేసి భద్రపరుస్తారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
విద్యార్థులు తప్పకుండా ఉదయం 8 గంటల వరకు కేంద్రాలకు వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలి. 8.45 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8.45 గంటల నుండి పరీక్ష మొదలై 9 గంటలకు ప్రశ్నాపత్రం ఇస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థికి అనుమతి ఉండదు. ఎట్టి పరిస్థితులోనైనా విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. విద్యార్థులు హాల్ టికెట్లు విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంటర్నెట్లో ప్రత్యేక వెబ్సైట్ ఉంది. టీఎస్బీఐ, సీజీజీ, జీవోపీ, ఇన్ నుండి నేరుగా పొందొచ్చు. హాల్ టికెట్పై కళాశాల ప్రిన్సిపల్ సంతకం కూడా అవసరం లేదు. ఫీజుల కోసం ఎవరైనా విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
పరీక్షల సందర్భంగా ప్రత్యేక బస్సులు
రవాణా సౌకర్యాలు లేని సెంటర్లకు ప్రత్యేక బస్సులు నడపాలని ఇప్పటికే ఆర్టీసి అధికారులను జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు లేఖ రాశారు. ప్రధానంగా నడిగూడెం సెంటర్కు పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదు. పరీక్షల కోసం రోజూ ఒక మినీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు.