Wednesday, April 24, 2024

వడ్డీ రేటు 0.50% పెంపు

- Advertisement -
- Advertisement -

Interest rate hike by 0.50%:RBI

5.40 శాతానికి పెరిగిన రెపో రేటు
వరుసగా మూడోసారి పెంచిన ఆర్‌బిఐ
ద్రవ్యోల్బణం కట్టడీనే లక్షమని వెల్లడి
మరింత భారం కానున్న ఇఎంఐలు

న్యూఢిల్లీ : మరోసారి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి అధికంగా 0.50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) రెపో రేటును ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) పెంచింది. దీంతో మొత్తం వడ్డీ రేటు 5.40 శాతానికి చేరింది. దీనివల్ల గృహ, వాహన రుణాల ఇఎంఐలు మరింత భారం కానున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడీయే లక్షంగా వడ్డీ రేట్లను పెంచడం వరుసగా ఇది మూడోసారి. తాజా పెంపుతో కరోనా మహమ్మారి ముందు స్థాయిలో ఉన్న వడ్డీ రేటు కంటే ఇప్పుడు రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది.

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్యవిధాన కమిటీ(ఎంపిసి) సమావేశం ఫలితాలను శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కట్టడీయే ప్రధాన లక్షమని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్భణం టార్గెట్ 6 శాతం పరిధిలోకి వచ్చేంత వరకు రేటు పెంపు కొనసాగుతుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఆరు నెలల పాటు ద్రవ్యోల్బణం నియంత్రణపై దృష్టి ఉంటుందని అన్నారు. అయితే దేశీయ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం అంచనాల్లో రిజర్వు బ్యాంక్ మార్పు చేయలేదు. 202223 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు అంటే జిడిపి 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 6.7 శాతమే కొనసాగించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ద్రవ్యోల్బణం అస్థిరంగా ఉంది. ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరిన అంతర్జాతీయ కమోడిటీ, మెటల్, ఆహార ధరలు దిగొస్తున్నాయి. దేశీయంగా చూస్తే, ఖరీఫ్ పంటలు బాగుండడం వల్ల ఆహార ధరలు తగ్గుతాయని దాస్ అన్నారు. రెపో రేటుతో పాటు ఆర్‌బిఐ ఎస్‌డిఎఫ్‌ను 4.65 శాతం నుంచి 5.15 శాతానికి పెంచింది. ఇది కాకుండా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్‌ఎఫ్) 5.15 శాతం నుండి 5.65 శాతానికి పెరిగింది.

డాలర్ బలపడడమే కారణం
అమెరికా డాలర్ విలువ నిరంతరం బలపడడమే భారత రూపాయి పతనానికి ప్రధాన కారణమని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. ఇతర గ్లోబల్ కరెన్సీతో పోలిస్తే రూపాయి విలువ క్షీణత చాలా తక్కువగా ఉంది. ఆర్‌బిఐ విధానాల వల్ల రూపాయి పతనం అదుపులో ఉంది. భారతదేశం నాలుగో అతిపెద్ద విదేశీ మారక నిల్వలను కలిగి ఉంది. మొదటి త్రైమాసికంలో దేశం 1,360 మిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ పెట్టుబడిని అందుకుంది.

భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి
ప్రపంచీకరణ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. గ్లోబల్ ఎకానమీలో మారుతున్న పరిణామాల వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై కూడా ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారుతున్న పరిస్థితులలోనూ భారత్ నిలకడగా కొనసాగుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆందోళనలు ఉన్నాయి. దేశీయ ఎగుమతి, దిగుమతి డేటాలో తేడా వల్ల కరెంట్ ఖాతా లోటు ఏర్పడగా, ఇది నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని భావిస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఐలు బిల్లులు చెల్లించవచ్చు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు వారి కుటుంబ సభ్యులకు విద్యుత్ బిల్లుల నుంచి పాఠశాల ఫీజుల వరకు చెల్లింపులు చేసేందుకు వీలుకల్పించింది. విదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్‌బిఐ తెలిపింది. దీంతో ప్రవాస భారతీయులు దేశంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు అన్ని రకాల యుటిలిటీ బిల్లులను చెల్లించగలరు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబిపిఎస్) అనేది బిల్లు చెల్లింపులు చేయడానికి ఒక ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌పామ్, 20,000 కంటే ఎక్కువ బిల్లర్లు ఈ సిస్టమ్‌కు అనుసంధానిస్తారు. ప్రతి నెలా ఈ ప్లాట్‌ఫామ్‌లో 80 మిలియన్లకు పైగా లావాదేవీలు కనిపిస్తాయి. దీని వల్ల సీనియర్ సిటిజన్లకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఆర్‌బిఐ త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

ఆర్‌బిఐ ముఖ్యాంశాలు
కీలక వడ్డీ రేటు(రెపో)ను 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.4 శాతానికి చేరిన రేటు, ఇది వరుసగా మూడోసారి పెంపు
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు 2022 మే నుంచి దాదాపు 140 బేసిస్ పాయింట్లు అంటే 1.40 శాతం మేరకు ఆర్‌బిఐ వడ్డీ రేటును పెంచింది
2022-23 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనా 7.2 శాతం, గత అంచనా కొనసాగించిన రిజర్వు బ్యాంక్
జిడిపి వృద్ధి అంచనా : క్యూ1 16.2 శాతం, క్యూ2 6.2 శాతం, క్యూ3 4.1 శాతం, క్యూ4 4 శాతం
క్యూ1లో వాస్తవ జిడిపి వృద్ధి : 202324 అంచనా 6.7 శాతం, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తృతమవుతోంది
రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా కూడా 202223కు 6.7 శాతం కొనసాగింపు
ద్రవ్యోల్బణం అంచనా : క్యూ2 7.1 శాతం, క్యూ3 6.4 శాతం, క్యూ4 5.8 శాతం, ఇక 202324 క్యూ1లో 5 శాతం
ఆగస్టు వరకు భారీగా 13.3 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడుల ఉపసంహరణ ఉంది
ఆర్థిక రంగం తగినంత మూలధనం కల్గివుంది
అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకునేందుకు భారతదేశం విదేశీ మారక నిల్వలు భరోసా ఇస్తున్నాయి
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గాను సర్దుబాటు వైఖరిని వదులుకోవడంపైనే దృష్టి పెట్టాలని ఆర్‌బిఐ ఎంపిసి నిర్ణయించింది
భారతదేశం ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాల్లో బలహీనత కంటే అమెరికా డాలర్ పెరగడం వల్ల రూపాయిలో క్షీణత ఉంది
రూపాయి స్థిరత్వం నిర్వహణపై ఆర్‌బిఐ ఫోకస్ కొనసాగుతూనే ఉంటుంది
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4 వరకు డాలర్‌తో పోలిస్తే రూపాయి 4.7 శాతం క్షీణించింది
భారతదేశం విదేశీ మారక నిల్వలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నాలుగో స్థానంలో ఉన్నాయి
భారత్‌లో ఎన్‌ఆర్‌ఐ కుటుంబాల తరఫున విద్య, ఇతర అవసరాల చెల్లింపుల కోసం భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ వినియోగానికి ఆర్‌బిఐ అనుమతి ఇచ్చింది.
తదుపరి ఆర్‌బిఐ ఎంపిసి సమావేశం 2022 సెప్టెంబర్ 2830 తేదీలలో జరగనుంది

ఆర్‌బిఐ టీమ్.. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్(మధ్య), డిప్యూటీ గవర్నర్లు మైఖెల్ దేవబ్రత పాత్ర, ఎం.కె.జైన్, ఎం.రాజేశ్వర్ రావు, రవి శంకర్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News