ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పైలట్ల బోగస్ లైసెన్స్ల వ్యవహారం అంతర్జాతీయ విమానయాన సంస్థల్ని కుదిపేసింది. ఖతార్ ఎయిర్వేస్సహా పలు అంతర్జాతీయ సంస్థలు పాక్ పైలట్లపై దర్యాప్తు ప్రారంభించాయి. పాకిస్థాన్ అధికారుల నుంచి నివేదిక వచ్చే వరకూ అనుమానిత జాబితాలో ఉన్నవారిని పక్కన పెట్టాలని నిర్ణయించాయి. కువైట్ ఎయిర్ ఏడుగురు పైలట్లు, 56మంది ఇంజినీర్లను..అలాగే ఖతార్ ఎయిర్వేస్, ఒమన్ ఎయిర్, వియత్నాం ఎయిర్లైన్స్ కూడా జాబితాలోని పాక్ పైలట్లను పక్కన పెడుతున్నట్టు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొన్నది. గత నెల 22న పాకిస్థాన్లో జరిగిన విమాన ప్రమాదంలో 97మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనకు పైలట్ల నిర్లక్ష్యమే కారణమని తేలడంతో ఆ దేశ విమానయానశాఖమంత్రి గులామ్ సర్వర్ కఠిన చర్యలకు ఆదేశించారు. 262మంది పైలట్లపై దర్యాప్తు పూర్తయ్యే వరకు పనిలోకి తీసుకోవద్దని విమాన సంస్థలకు సూచించారు.