Thursday, April 25, 2024

ఆగని బెట్టింగ్ దందా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి వేసవి కాలంలో ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ప్రజలకు ఉన్న క్రేజీని సొమ్ము చేసుకునేందుకు చాలా మంది బెట్టింగ్ నిర్వాహకులు తమ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బెట్టింగ్ రాయుళ్లు పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వారి ద్వారా బెట్టింగ్ కట్టేవారిని సంప్రదిస్తున్నారు. చాలామంది విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, వ్యాపారులు బెట్టింగ్ కడుతున్నారు. కొందరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి బెట్టింగ్ కడుతున్నారు. ఇందులో చాలామంది బాధితులు లక్షలాది రూపాయలు పోయి వీధిన పడుతున్నారు. అయినా కూడా బెట్టింగ్ కట్టడం ఆగడంలేదు, డబ్బులు వస్తాయనే ఆశతో మళ్లీ బెట్టింగ్‌లోకి దిగి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

స్థానికంగా బెట్టింగ్ నిర్వహించే ఏజెంట్లు అంతర్జాతీయ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి యాప్‌లను తీసుకుంటున్నారు. వాటి ద్వారా బెట్టింగ్ కట్టే వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చి బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్నారు. ఇక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలో పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో చాలా బెట్టింగ్ ముఠాలు శివారును అడ్డాగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. బాచుపల్లి, హయత్‌నగర్, ఆర్‌సి పురం తదితర ప్రాంతాల్లో బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాలను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.39కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముడు ముఠాలు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు పెద్ద ఎత్తున బెట్టింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.60లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు ముఠాలు రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వనస్థలిపురం, సరూర్‌నగ్ పోలీసులు రెండు ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బేగంబజార్‌కు చెందిన కొందరు వ్యక్తులు బెట్టింగ్ నిర్వహిస్తుండడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

సులభ సంపాదన కోసమే….
బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు విచారించగా సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్ నిర్వహిస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. చాలామంది నిర్వాహకులు సీజ్‌ను ఆసరాగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్ క్రికెట్‌కు ఉన్న క్రేజీని సొమ్ము చేసుకోవాలని చాలామంది బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పంటర్లను నియమించుకుని వారి ద్వారా బెట్టింగ్ కట్టేవారిని సంప్రదిస్తున్నారు. బాల్‌కు, ఫోర్, సిక్స్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తాయని ఆశపడి చాలామంది చేతిలో డబ్బులు లేకున్నా అప్పులు చేసి బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో తిరిగి కోలుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా బెట్టింగ్ కట్టడం మానడంలేదు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా కూడా బెట్టింగ్ నిర్వాహకులు వెనకడుగు వేయడంలేదు, కమీషన్ రూపంలో భారీగా డబ్బులు వస్తుండడంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నలు తెలుస్తోంది.
అంతా ఆన్‌లైన్ పేమెంట్…..
బెట్టింగ్ నిర్వాహకులు గతంలో నగదు లావాదేవీలు నిర్వహించేవారు, కాని ఇప్పుడు బెట్టింగ్ మొత్తం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ కట్టే వారి నుంచి తీసుకోవడం, వారికి పేమెంట్ చేయడం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. పోలీసులకు దొరకకుండా యాప్‌లను తయారు చేయడంతో వాటి ద్వారా బెట్టింగ్ కడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News