Friday, March 29, 2024

బాల వికాసలో ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. బాల వికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి 20 బృందాలుగా విడిపోయిన ఐటి అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అల్వాల్, బొల్లారం, కీసర, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి, జీడిమెట్ల, పటాన్‌చెరు, సికింద్రా బాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి బాల వికాస సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చెందిన ఆస్తులపై ఐటి శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన రూ.412 కోట్ల లావాదేవీలపై ఐటి శాఖ తనిఖీలు చేపట్టింది.

సొసైటీ పేరు చెప్పి విదేశాల నుంచి శౌరెడ్డి నిధులు రాబట్టారు. విదేశీ నిధులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు గుర్తించింది. శౌరెడ్డి, భార్య సునీతా రెడ్డి పేర్లపై భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించింది. అలాగే సొసైటీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లపైనా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా గుర్తిం చింది. . రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న బాలవికాసకు సంబంధించిన ముఖ్య కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఈ సంస్థకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో పెద్ద ఎత్తున దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ అల్వాల్‌లోని సాజిజాన్ అనే వ్యక్తి నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహిం చారు. బాల వికాస అనే క్రిస్టియన్ మిషనరీకి జాన్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సంస్థకు చెందిన డాక్యుమెం ట్లను, ఆస్తులను పరిశీలించినట్లు సమాచారం.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? అన్న కోణంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిం చారని తెలుస్తోంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని బాల వికాస పీపుల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. సిబ్బంది సెల్‌పోన్‌లు స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహించారు. దాంతో పాటుగా సోమాజీగూడలోని కార్యాలయంలోనూ డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల లోనూ, కీసరలోని 28 ఎకరాల్లో నిర్మించిన భారీ భవన సముదాయాలలోనూ అధికా రులు సోదాలు నిర్వహించారు. కాగా, బాల వికాస సంస్థకు డైరెక్టర్లుగా సురేష్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, ఏలేటి, సురేష్‌రెడ్డి సింగిరెడ్డి ఉన్నట్లు సమాచారం. 2016లో బాల వికాస సంస్థ ప్రారంభమైంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎన్‌జివోగా బాల వికాస రిజిస్టర్ అయ్యింది.

కాగా కొన్ని రోజుల క్రితం ఐటి అధికారులు వసుధ ఫార్మా కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి స్థిరాస్తి సంస్థ వండర్ సిటీ, రాయల్ సిటీతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్‌పై దాడులు చేశారు. మంత్రి మల్లారెడ్డి, అతడి సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిం చారు. ఆ సమయంలో ఐటి అధికారులు భారీగా పాల్గొన్నారు. ఏకంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్, ఎంపి గాయత్రి రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారుల సోదాలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి ఐటి దాడులు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఐటి దాడులపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు

బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఐటి దాడుల కుట్రకు తెరదీసిందని ఆరోపణ

బాల వికాసపై ఐటీ దాడులపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు బాల వికాస లాంటి సేవా సంస్థలపై ఐటి దాడులు అమానుషం అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బాలవికాసపై ఐటి దాడులను ఖండించిన మంత్రి ఎర్రబెల్లి గత 25, 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస అని, ఈ సంస్థపై దాడులు బాధాకరం అన్నారు. బాలవికాస క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన సంస్థ కావడం వల్లే ఐటి దాడులు సాగుతున్నాయని పేర్కొన్నారు.

నిస్వార్థ ప్రజా సేవ లను బిజెపి ప్రభుత్వం అడ్డుకోవాలని కుట్ర కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటి దాడులు చేస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రంలోని బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతుంది అనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఎంతోమంది ప్రముఖులు ప్రశంసించిన, మారు మూల గ్రామాలకు సైతం రక్షిత మంచినీటితో పాటు, అనేక సేవలను అందిస్తున్న బాలవికాస సంస్థపై ఐటి దాడులు చేయడం అవమాన కరమని ఆయన అభిప్రాయపడ్డారు. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఆ సంస్థ సేవలను ఆపాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదన్నారు. బిజెపి రాష్ట్రంలో ఐటి దాడుల కుట్రకు తెర తీసిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News