పాలకవీడు : హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఉర్సు ఉత్సవాలకు మిర్యాలగూడెం, నేరెడుచర్ల, హుజూర్నగర్, పాలకవీడు, గరిడేపల్లి, కోదాడ,సూర్యపేటలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు రానున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ప్భోర్డు ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గా వద్ద భారీ కేడ్లతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
దర్గా పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆయా కార్యక్రమాలను తహశీల్దార్ జి.కృష్ణ, యమ్పిడిఓ జానయ్య, ఏపిఓ దయాకర్, విఆర్ఓ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మండలంలోని భవానిపురంలో గల దక్కన్ సిమెంట్స్ పరిశ్రమ ఆద్వర్యంలో ఆరు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేస్తున్నట్లు పరిశ్రమ డిజియమ్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. విద్యుత్ అధికారులు విద్యుత్ మరమ్మత్తులు నిర్వహించి ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆర్టిసి డిపోల వారిచే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు.