Thursday, April 25, 2024

జపనీస్ ఎన్‌సిఫలిటిస్‌తో 23 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గౌహతి : అసోంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడు వాపు వ్యాధి విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంతవరకు 23 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి మెదడువాపు. దీనివల్ల మెదడు లోని నాడీ కణాల్లో వాపు వచ్చి వాటి పనితీరులో అవరోధాలు ఏర్పడతాయి. ఇది సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారకస్థితి , మూర్ఛ, వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వైరల్ బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో అసోంలో గత ఏప్రిల్ నుంచి 23 మంది మృతి చెందారని, అసోం నేషనల్ హెల్త్ మిషన్ తెలిపింది. గత 24 గంటల్లో వరద బాధిత ప్రాంతాలైన మొరిగావ్ జిల్లా నుంచి ఇద్దరు, నల్బరి జిల్లా నుంచి ఇద్దరు ఇన్‌ఫెక్షన్‌తో మరణించారని, దీంతో ఈ వ్యాధికి బలైన వారి సంఖ్య 23 కు చేరిందని ఆ మిషన్ తెలిపింది.

కేవలం గత 24 గంటల్లోనే 16 కొత్త కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. వీటిలో నాలుగు కేసులు నాగోవ్ లోను, నల్బరి, ఉదల్‌గిరిలో మూడేసి, శివసాగర్‌లో రెండు, బార్‌పేట, కుమ్రువ్(మెట్రో), కార్బి ఆంగ్లాంగ్ ఈస్ట్, హొజాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో జపాన్ ఎన్‌సెఫలిటిస్ కేసుల సంఖ్య 160 కి చేరింది. గత నాలుగేళ్లలో జపాన్ ఎన్‌సిఫలిటిస్, యాక్యూట్ ఎన్‌సిఫిలిటిస్ సిండ్రోమ్ కారణంగా రాష్ట్రంలో 1069 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 లో 277 మంది, 2019లో 514 మంది, 2020లో 147 మంది, 2021లో 131 మంది మృతి చెందారు. అన్ని జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News