Thursday, April 25, 2024

ఎపిని వదిలిపెట్టి తెలంగాణకు వచ్చేస్తా

- Advertisement -
- Advertisement -

JC Diwakar Reddy said that he would leave AP and come to Telangana

మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రాయల తెలంగాణ కావాలంటే అప్పటి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి చివరి నిమిషంలో ఒప్పుకోలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తానని మాజీ మంత్రి జేసి దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయల తెలంగాణకు మొదట్లో జైపాల్‌రెడ్డి ఒప్పుకున్నా చివరి నిమిషంలో తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయనని రాయల తెలంగాణకు ఒప్పుకోలేదన్నారు. శుక్రవారం జేసి దివాకర్‌రెడ్డి తెలంగాణ సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణతో పాటు ఎపి రాజకీయాల గురించి తనదైన శైలిలో స్పందించారు.

తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జేసీ శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు అసెంబ్లీ లాబీలో మంత్రి కెటిఆర్‌ను ఆయన కలిశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తన పాత మిత్రులను కలవడానికే సిఎల్పీకి వచ్చానని ఆయన విలేకరులతో తెలిపారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో సరదాగా మాట్లాడారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడూ కలవలేదని అందుకే ఇప్పుడు కలిసి మాట్లాడినట్టు ఆయన స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని రాయలసీమను కూడా తెలంగాణలో కలిపి ఉంటే బాగుండేదన్నారు.తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామన్నారు.

జానారెడ్డి తనకు మంచి మిత్రుడు

జానారెడ్డి తనకు మంచి మిత్రుడని అయితే సాగర్ ఉప ఎన్నికలో గెలవడం కష్టమని ముందుగానే చెప్పానన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజం కూడా అంతగా బాగోలేదని జేసి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయంగా అభివృద్ధి చెందిందని జేసి తెలిపారు. హుజూరాబాద్ గురించి తనకు తెలియదన్నారు.

క్లాస్ పీకిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సిఎల్పీకి వచ్చిన జేసి దివాకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి క్లాస్ పీకారు. ఏదైనా రాజకీయాలు మాట్లాడాలంటే సిఎల్పీ బయటే చూసుకోవాలన్నారు. ఇక్కడికొచ్చి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టొద్దని ఆయన సూచించారు. ప్రతిసారీ ఇదో అలవాటైపోయిందని టి.జీవన్‌రెడ్డి జేసిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా జేసీ దివాకర్ రెడ్డి షాక్ అయ్యారు. ఈ ఘటన నుంచి వెంటనే తేరుకున్న జేసి దివాకర్‌రెడ్డి జీవన్‌రెడ్డికి క్షమాపణ చెప్పారు. సారీ చెప్పాల్సిన అవసరం లేదని, ఏదైనా ఉంటే సిఎల్పీ బయట మాట్లాడుకోవాలని టి.జీవన్‌రెడ్డి దివాకర్‌రెడ్డికి సూచించారు. నీతి లోపించింది, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా సిఎల్పీలో మాట్లాడొద్దని జేసికి భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు మరోమారు సూచించారు.

పుట్టింది, పెరిగింది కాంగ్రెస్ పార్టీలోనే

వారి మాటలకు స్పందించిన జేసి తాను పుట్టింది, పెరిగింది, అభివృద్ధి చెందింది కూడా కాంగ్రెస్ పార్టీలోనేనని ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి షోకాజ్ నోటీసులు తీసుకోనని ఆయన వెల్లడించారు. రాజకీయ నాయకుల్లో నీతి లోపించిందని, జనాలను తప్పు దోవ పట్టించేది రాజకీయ నాయకులేనని జేసి అభిప్రాయపడ్డారు. తాను 1980లో సమితి ప్రెసిడెంట్ పదవి కోసం రూ.10వేలు ఖర్చు చేస్తే ఇప్పుడు ఎంపిగా నిలపడితే రూ.50 కోట్లు ఖర్చవుతోందన్నారు.

ఎపిలో ఐఏఎస్ పోస్టులకే గ్యారెంటీ లేదు…!

ఎపి సిఎం జగన్ మొదట్లో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డిజిపి గౌతమ్ సవాంగ్‌లను అన్న అని పబ్లిక్‌గా పిలిచాడు. ఇలా జగన్ తప్ప ఏ సిఎం పిలవరు. ఆఖరికి అదే సుబ్రహ్మణ్యంను బాపట్ల కాలేజీలో రిజిస్ట్రార్‌గా సిఎం జగన్ నియమించారు. ఎపిలో ఐఏఎస్‌లకే గ్యారెంటీ లేదు. చీఫ్ సెక్రటరీనే తీసి కళాశాలల్లో పాఠాలు చెప్పుకోమన్నారు. గతంలో చెన్నారెడ్డి మాటల్లో చెబితే, జగన్ చేతల్లో చూపిస్తున్నారని జేసి దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపిఎస్‌ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఎపిలో స్థానిక సంస్థల ఫలితాలు తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదన్నారు. జగన్ అనుకున్నారు, ఆ ఫలితాలు వచ్చాయన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎపిలో ఓటు 4 నుంచి 5 వేలకు పోతుందని, మొన్నటి ఎంపి ఎన్నికల్లో ఒక్కొక్కరూ రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. అధికారంలో లేని వ్యక్తి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ. 15 నుంచి రూ. 20 కోట్లు ఇచ్చారని, జగన్‌కు హైదరాబాద్ నుంచి కూడా డబ్బులు లారీల్లో వచ్చాయని జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News