Friday, March 29, 2024

నేడు జెఇఇ అడ్వాన్స్‌డ్

- Advertisement -
- Advertisement -

JEE Advanced 2021 today

ఉ. 9గం. నుంచి పేపర్ 1
మ.2.30 నుంచి పేపర్ 2

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటిలలో ప్రవేశాలకు ఆదివారం(అక్టోబర్ 3) జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత కేంద్రాల్లోకి అనుమతించరు. నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు. పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. కొవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాలి. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు హాలులోకి అనుమతిస్తారు. అభ్యర్థులు సొంత మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలి. చిన్న శానిటైజర్ బాటిల్, పారదర్శకంగా ఉంటే వాటర్ బాటిల్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది అర్హత సాధించగా 1.70 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు.

అందులో తెలంగాణ నుంచి సుమారు 14 వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ నగరాలలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగనుంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు దేశంలోని 23 ఐఐటీల్లో బి.టెక్ సీట్లకు పోటీ పడొచ్చు. గత ఏడాది 16,061 సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి కనీసం మరో 500 వరకు పెరుగనున్నాయి. ఫలితాలను అక్టోబరు 15 న వెల్లడిస్తామని ఐఐటీ ఖరగ్ పూర్ ఇప్పటికే ప్రకటించింది.

బార్‌కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష గది వివరాలు

కొవిడ్- 19 నేపథ్యంలో పరీక్షా కేంద్రాల రద్దీ ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే సమయంలో వారి హాల్ టికెట్లపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేసి, వారికి కేటాయించిన కంప్యూటర్ ఏ ల్యాబ్‌లో ఉందో తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు గుడికూడకుండా తమకు కేటాయించిన గదికి నేరుగా వెళతారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ బాటిళ్లు అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన తర్వాత విద్యార్థులకు కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్ స్క్రీన్‌పై రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.రఫ్ వర్కు కోసం ప్రత్యేకంగా స్క్రిబిల్ ప్యాడ్ అందిస్తారు. అదనంగా మళ్లీ ఇవ్వరు. అభ్యర్థులు వాటిని తమతో పాటు తీసుకువెళ్లవచ్చు. పెన్, పెన్సిల్ విద్యార్థులే తెచ్చుకోవాలి. వీటిని పరీక్ష కేంద్రంలో ఇవ్వరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News