మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి రావడం లాంటి పరిణమాల నేపథ్యంలో విద్యాసంస్థలు, మీ సేవా కేంద్రాలు మూతపడిన నేపథ్యంలో చాలా మంది విద్యార్థులకు వివిధ ఎంట్రెన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జెఇఇ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరో అవకాశం ఇచ్చింది.
మే 19 నుంచి 24 వరకు జెఇఇ మెయిన్ దరఖాస్తులకు అవకాశం కల్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) నిర్ణయించింది. మే 24 లోపు అభ్యర్థులందరూ తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని ఎన్టిఎ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వినీత్ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా జెఇఇ అప్లికేషన్స్ విండోను మంగళవారం(మే 19) ఓపెన్ చేశామని, మే 24న తిరిగి క్లోజ్ చేస్తారని తెలిపారు. జెఇఇ దరఖాస్తులకు ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు. జెఇఇ మెయిన్ పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు తల్లిదండ్రులు క్రమంగా జెఇఇ మెయిన్, ఎన్టిఎ వెబ్సైట్లను చూడాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 8287471852, 8178359845, 9640173668, 9599676953, 8882356803 ఫోన్ నెంబర్లలో లేదా jeemain@ntaకు ఇ మెయిల్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.