ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్ఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్(సిఎఫ్టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్) దరఖాస్తుల ప్రక్రియ గురువారం(మార్చి 12)తో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియగా, దానిని ఈ నెల 12వ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) పొడిగించింది. గత నెల 7వ తేదీ నుంచి జెఇఇ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, ఈ నెల 12వ తేదీతో ముగియనుంది.
రెండవ విడత జెఇఇ పరీక్షలు ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో నిర్వహించనున్నట్లు ఎన్టిఎ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 6 నుంచి 9 వరకు నాలుగు రోజులపాటు రోజూ రెండు షిఫ్టుల్లో జరిగిన జరిగిన మొదటి విడత పరీక్షలకు 9,21,261 మంది రిజిష్టర్ చేసుకోగా, 8,69,010 మంది హాజరయ్యారు. గత ఏడాది నుంచి జెఇఇ మెయిన్ పరీక్షను ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తున్నారు. జెఇఇ మెయిన్ 2020 జనవరిలో, రెండవ జెఇఇ మెయిన్ మెయిన్ ఏప్రిల్లో ఉంటుంది. ఒక అభ్యర్థి ఈ రెండు పరీక్షలకూ హాజరు కావచ్చు. ఏ పరీక్షలో మార్కులు ఎక్కువగా వస్తే ఆ మార్కులనే అడ్మిషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. జెఇఇ మెయిన్కు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది విద్యార్థులు హాజరవుతున్నారు.