రెండవ జెఇఇకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
హైదరాబాద్ : తొలి జెఇఇ మెయిన్ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) విడుదల చేసింది. అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు https://jeemain.nta.nic.in ద్వారా సవాల్ చేయవచ్చునని ఎన్టిఎ తెలిపింది. ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు గుర్తించిన విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలు తెలపాలని తెలిపింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది కీ విడుదల చేసి వెంటనే స్కోర్ విడుదల చేయనున్నారు.
ఈనెల 23 నుంచి 26 వరకు జరిగిన మొదటి విడత జెఇఇ మెయిన్ పేపర్- 1 పరీక్షకు 6,52,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, వారిలో 6,20,153 మంది హాజరయ్యారు. మొదటి విడతలో గరిష్ఠంగా 295 మార్కులు స్కోర్ ఉండవచ్చునని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు జరగనున్న రెండవ విడత జెఇఇ మెయిన్ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈనెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు స్వీకరణ చేయనున్నట్లు ఎన్టిఎ వెల్లడించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.