సెంచూరి ఆసుపత్రిలో దారుణం
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లోని సెంచూరి ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందిన మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కరోనా అత్యవసర చికిత్స కోసం గత నెల 23 ఓ మహిళ బంజారాహిల్స్లోని సెంచరీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 25 అర్ధరాత్రి మృతిచెందారు. అనంతరం చేతి ఉంగరం, వజ్రాపు చెవి దుద్దులు, ముక్కుపుడక ఇతర ఆభరణాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
ఆస్పత్రి యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతురాలి కుమారుడు తెలిపారు. అపహరణకు గురైన ఆభరణాలు విలువ రూ. లక్ష ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిందెవరు..? మృతురాలి బంధువులే ఈ పనిచేశారా..? లేకుంటే మరెవరైనా చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.