Thursday, March 28, 2024

రేపు హకీంపేటలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోసం జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భద్రతా బలగాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం (మార్చి 28) హకీంపేటలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోసం భారీ స్థాయిలో జాబ్ మేళా ఏర్పాటుచేయనున్న సందర్భంగా కేంద్రమంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అందరికీ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రక్షణ శాఖ విభాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్, రిటైర్ అయిన సాయుధ బలగాల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా సెమినార్లు, జాబ్‌మేళాలు నిర్వహిస్తోందన్నారు. సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కార్పొరేట్ కంపెనీలు, పిఎస్‌యూలకు ఈ సెమినార్లు వారథిగా పనిచేస్తున్నాయన్నారు.

జాబ్ మేళాతో మాజీ సైనికఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థలకు.. ఇరువురికీ పరస్పర లబ్ధి చేకూరుతుందన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ సమన్వయ పరుస్తోందన్నారు. రిటైర్డ్ అయిన భద్రతా బలగాల సిబ్బందికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. త్రివిధ దళాల్లో పని చేసిన (37 నుంచి 57 ఏళ్ల లోపు) వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. జాబ్ మేళా పాల్గొనాల్సిన వారు. https://dgrindia.gov.in నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News