అఫ్ఘాన్లో జాతి నిర్మాణం మా బాధ్యత కాదు
బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్నుంచి సైనిక బలగాల ఉపసంహరణ,అటు తర్వాత తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై అంతర్జాతీయ సమాజంనుంచి తీవ్ర విమర్శలు వెల్ల్లువెత్తుతున్నాయి. అమెరికా నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పగించాడంటూ అఫ్ఘాన్ప్రభుత్వం, ప్రజలు సైతం జో బైడెన్పై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో బైడెన్ మీడియా ముఖంగా స్పందించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్ఘానిస్థాన్ పరిస్థితులపై కీలక ప్రకటన చేశారు. ‘అఫ్ఘాన్నుంచి బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాం. రెండు దశాబ్దాల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయంపై మేం చింతించడం లేదు. అమెరికా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి అమెరికా దళాలను వెనక్కి రప్పించుకోవడం, రెండోది మూడో దశాబ్దంలోను మరింత సైన్యాన్ని పంపి.. మోహరింపును కొనసాగించడం.
రెండో దారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైనదేనని భావిస్తున్నాం’ అని బైడెన్ వెల్లడించారు. అఫ్ఘానిస్థాన్లో జాతి నిర్మాణం తమ బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్షమని బైడెన్ స్పష్టం చేశారు. ‘20 ఏళ్ల క్రితం అఫ్ఘానిస్థాన్లో అల్ఖైదాను అంతం చేశాం. బిన్లాడెన్ను పట్టుకునేందుకు మేం వెనకాడలేదు. రెండు దశాబ్దాలుగా అఫ్ఘాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వానికి మనోధైర్యం అందించాం. కానీ వాళ్లు పోరాట శక్తిని ప్రదర్శించలేక పోయారు. అక్కడి ప్రభుత్వం ఊహించినదానికన్నా వేగంగా పతనమైంది. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. అవసరమైతే అఫ్ఘాన్ ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం. అఫ్ఘాన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అని బైడెన్ స్పష్టం చేశారు. మరోవైపు తాలిబన్ల చర్యలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన బైడెన్ అఫ్ఘాన్నుంచి అమెరికా ప్రతినిధులను వెనక్కి రప్పించామని, అమెరికా సైన్యానికి సాయం చేసిన అఫ్ఘాన్ ప్రజలకు సౌతం అవసరమైన చేయూత అందిస్తామని స్పష్టంచేశారు.