Friday, March 29, 2024

రష్యాపై అమెరికా తొలి విడత ఆంక్షలు!

- Advertisement -
- Advertisement -
Joe Biden has imposed sanctions on Russia
పాశ్చాత్య దేశాల నుంచి ఆర్థిక సాయం అందకుండా కోతలు
బాల్టిక్‌లోని మిత్రరాజ్యాలకు అమెరికా అదనపు బలగాలు

వాషింగ్టన్: పాశ్చాత్య దేశాలతో వాణిజ్యం చేయకుండా రష్యాపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ చట్టాన్ని రష్యా స్పష్టంగా ఉల్లంఘించినందుకుగాను ఆయన ఈ ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా కాలుదువ్వుతుండడంతో అమెరికా ‘తొలి విడత’ ఆంక్షలను ప్రకటించింది. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు, రష్యా సార్వభౌమాధికారం, రష్యా ఉన్నతవర్గాలు, వారి కుటుంబ సభ్యులపై ఈ ఆంక్షలు ప్రకటించారు. “అమెరికా చర్యలు పాశ్చాత్య దేశాల నుంచి రష్యా ప్రభుత్వానికి ఆర్థిక మద్దతు అందకుండా చేస్తుంది” అని బైడెన్ తెలిపారు. ఆయన మంగళవారం ‘వైట్ హౌస్’ నుంచి ప్రసంగిస్తూ ‘నాటో’ తూర్పు పార్శంలోని అమెరికా మిత్రదేశాలైన బాల్టిక్ దేశాలను బలోపేతం చేయడానికి అదనపు బలగాలను, పరికరాలను పంపుతున్నట్లు కూడా ప్రకటించారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రత్యేక ప్రాంతాలైన్ లుహాన్క్, దొనేత్సక్‌లోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బలగాలను పంపారు. “ఇది స్పష్టంగా అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనే” అని జోబైడెన్ అభిప్రాయపడ్డారు. “పొరుగు దేశాలలోని ప్రదేశాలలో కొత్త దేశాలను ప్రకటించే హక్కును పుతిన్‌కు ఎవరిచ్చారు?” అని కూడా బైడెన్ ప్రశ్నించారు. ఈ ప్రాంతాలు ఉక్రెయిన్‌కు ఇక ఏ మాత్రం చెందినవి కావని పుతిన్ ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌లోని పెద్ద భాగాన్ని రష్యా కబలించాలను చూస్తోంది” అని బైడెన్ స్పష్టం చేశారు. ఇదివుండగా ఈ వారం తర్వాత జెనీవాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జరగాల్సిన సమావేశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింక్ రద్దు చేశారు. కాగా రష్యా మాత్రం ఉక్రెయిన్‌కు చెందిన రెండు ప్రాంతాలను వేర్పాటు ప్రాంతాలుగా గుర్తించే విషయంలో ముందుకు వెళుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కనుక చేస్తే దానిపై తీవ్ర ఆంక్షలు విధిస్తామని అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రకటించాయి.

కాగా ఇప్పుడు దానికి సమయం వచ్చినట్లు గోచరిస్తోంది. “ఒకవేళ రష్యా తదుపరి చర్యకు దిగితే,మేము కూడా తదుపరి చర్యకు దిగుతాము” అని బైడెన్ తెలిపారు. ఇదిలావుండగా బెలారస్ నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకోనని చెప్పిన తర్వాత అమెరికా మరిన్ని బలగాలను, యుద్ధ సామాగ్రిని యూరొప్‌కు తరలించే యత్నంలో ఉంది. ముఖ్యంగా బాల్టిక్ మిత్రరాజ్యాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాలను మరింత బలోపేతం చేసే అదనపు చర్యలను చేపట్టబోతున్నది. “మాకు రష్యాతో యుద్ధం చేయాలన్న ఆకాంక్ష లేదు, కానీ మా వైపు నుంచి మేము ఎదుర్కొనే చర్యలు (డిఫెన్సివ్ మూవ్స్) చేపడతాము. ‘నాటో’ భూభాగాన్ని కాపాడతామని మేము సందేశాన్ని పంపుతున్నాము. ఉక్రెయిన్‌పై దాడిచేసేందుకు రష్యా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో నేను పొరపాటుపడినా పడవచ్చు. కానీ ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఉద్రిక్తతలు పెంచేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ సహా ప్రధాన నగరాలపై రష్యా దాడిచేయాలనుకుంటోంది.ఉక్రెయిన్ చుట్టూత 1,50,000 రష్యా బలగాలను మోహరించింది” అని బైడెన్ తెలిపారు.

బ్రిటన్ హెచ్చరిక

ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం హెచ్చరించింది. తూర్పు ఉక్రెయిన్ నుంచి రష్యా తన బలగాలను వెనక్కి తీసుకోకుంటే రష్యాకు చెందిన మరిన్ని బ్యాంకులు, ధనవంతులు, కీ కంపెనీలను లక్షం చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ మాట్లాడుతూ “ బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం పార్లమెంటులో ఐదు రష్యా బ్యాంకులపై, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సంబంధాలున్న ముగ్గురు బిలియనీర్లపై ప్రకటించిన ఆంక్షలు ‘తీవ్రమైనవి’. అయితే మరిన్ని చర్యలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి” అన్నారు. ఇదిలావుండగా బాల్టిక్ సముద్రంలో రష్యా నిర్మిస్తున్న ‘నార్డ్ స్ట్రీమ్2 గ్యాస్ పైప్‌లైన్’కు ఆమోదాన్ని ఆపేయాలన్ని నిర్ణయించినట్లు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు 10 బిలియన్ యూరోలు విలువచేసే ప్రాజెక్టు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News