చేవెళ్ల, వికారాబాద్ సభ సక్సెస్
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
పార్టీ నేతల్లో సంబరం
స్థానిక సమస్యలపై ఉత్తమ్ హామీల వర్షం
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేవెళ్ల నుంచి ప్రారంభించిన బస్సు యాత్రకు జనం భారీగా తరలిరావడంతో క్యాడర్లో జోష్ కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి జిల్లాకు బయలుదేరిన నుంచి జిల్లా నేతలు దగ్గరుండి స్వాగతం పలికారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరెమైసమ్మ దేవాలయం వద్ద నేతలు స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొయినాబాద్ చర్చిలో ప్రార్ధనలు చేశారు. పోలీస్ అకాడమీ నుంచి చేవెళ్ల వరకు వాహన కాన్వాయ్తో నేతలు హంగామా చేశారు. రెండు గంటలు సమావేశం ఆలస్యంగా ప్రారంభమైన జనం మాత్రం ఓపికతో వేచిచూశారు. చేవెళ్ల సభకు అనుకున్నదాని కన్న అధికంగా జనం తరలిరావడంతో కుర్చిలు లేక ఇబ్బందులు పడ్డారు. బస్సు యాత్రకు గ్రామాల నుంచి యువకులు, నేతలు బైక్ ర్యాలీలతో తరలివచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారు. మాజీ మంత్రి సబితారెడ్డి, కార్తీక్ రెడ్డిలు తీవ్రస్థాయిలో శ్రమించి సభను విజయవంతం చేయడానికి కృషి చేయడంతో రాష్ట్రస్థాయి నేతలంతా వారిని అభినందించారు. హైద్రాబాద్ నుంచి చేవెళ్ల వైపు దారులన్నీ కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలతో నిండిపోయాయి. చేవెళ్ల, వికారాబాద్ సభలకు అనుకున్న దానికన్నా అధికంగా జనం తరలిరావడంతో నేతల్లో జోష్ కనిపిస్తుంది. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న నేతలకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.
చేవెళ్లకు హామీల పర్వం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేవెళ్ల గడ్డ కీలకం కానుందని పవర్లోకి వచ్చిన వెంటనే స్థానిక ప్రజల ఇబ్బందులు దూరం చేస్తామని పిసిసి చీఫ్ ఉత్తమ్ వరాలు ప్రకటించారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుతో పాటు జిఒ 111 పునఃసమీక్షిస్తామని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తీరిని ప్రారంభించి రంగారెడ్డి జిల్లాకు తాగునీరు, సాగు నీరు అందచేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి భరోసా కల్పిస్తామన్నారు. జిల్లాలో ఐటిఐఆర్ ద్వారా 2.5 లక్షల కోట్ల నిధులు రావడంతో పాటు 5 లక్షల మందికి ఉపాధి వస్తుందన్నారు.
రేవంత్కు నీరాజనాలు…
చేవెళ్ల సభకు రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్టన్గా మారారు. నేతలు ఎవరు మాట్లాడానికి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడాలని జనం నుంచి కేకలు రావడంతో సీనియర్లు అసహనానికి గురైయ్యారు. రేవంత్ మాట్లాడిన అనంతరం జనం ఉండరని ముందే గ్రహించిన నేతలు చివరివరకు రేవంత్కు అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జోష్ల మోత మ్రోగింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన అనంతరం జనం లేచి భయటకు వెల్లిపోతుండటంతో ఎవరు వారించిన పెద్దగా పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కెఎల్ఆర్ చేవెళ్ల సభలో కనిపించకపోవడంపై పలు గుసగుసలు ప్రారంభమయ్యాయి