కరీంనగర్ : రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరగా.. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బుధవారం నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా.. 20, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు తుల రాజేశ్వరి, చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 58 డివిజన్లకు ఈ నెల 24న పోలింగ్ నిర్వహించగా.. 27న ఫలితాలు వచ్చాయి.
ఇందులో ఏకగ్రీవ స్థానాలతో కలుపుకొని టీఆర్ఎస్ 33 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలువగా వీరిలో ఏడుగురు సభ్యులు మంగళవారం మంత్రి కెటిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు బల్దియా సమావేశ మందిరంలో నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్లను చేతులు ఎత్తేవిధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.