ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోగా ప్రక్రియ పూర్తి
నూటికి నూరు శాతం భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత
వేగవంతంగా ఆన్లైన్లో ఆస్తుల నమోదు ప్రక్రియ
అన్నిస్థాయిల అధికారులు ప్రజలకు సహకరించాలి
హరితహారం, చెత్తసేకరణపై ఆకస్మిక తనిఖీలు, ఫ్లయింగ్స్వాడ్లు
ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను 100శాతం వెంటనే ఆన్ లైన్ చేయాలని సిఎం సూచించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎంఒ ఉన్నతాధికారులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. ఈ ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి డిపిఒలు, ఎంపిఒలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సిఎం కోరారు.
భూరికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్ యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.
కేంద్ర అటవీ శాఖ నుంచి లభించిన అనుమతి
హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేశవాపురం వద్ద నిర్మిస్తున్న 10 టిఎంసిల రిజర్వాయర్ కు అవసరమైన 409.53 హెక్టార్ల అటవీ భూమికి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుండి రాష్ట్ర అటవీశాఖకు అనుమతి లేఖ అందింది.
KCR Review on Dharani Portal at Pragathi Bhavan