Friday, March 29, 2024

ముకరంజాకు కెసిఆర్ నివాళి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎనిమిదో నిజాం ముకరం జా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. అక్కడి నుండి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. మంగళవారం నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అనుమతించారు. బుధవారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలు, నిజాం అభిమానులు ముకరం జా పార్థివ దేహాన్ని చూసేందుకు అనుమతించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. చౌమహల్లా ప్యాలెస్ నుండి మక్కా మసీదు వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 4.45 గంటలకు అసర్ నమాజ్ తర్వాత ముస్లింల సాంప్రదాయ బద్దంగా పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ముకరం జా పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు అయిన ముకరం జా బహాదూర్ శనివారం ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా చౌమొహల్లా ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ బలగాలను మోహరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎకె ఖాన్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ జిత్ మాన్, దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్యలు బందోబస్తు ను పర్యవేక్షిస్తున్నారు. ముకరంజా భార్య ప్రిన్స్ అస్రా మొదటగా చౌమోహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు.

సిఎం కెసిఆర్ సంతాపం

హైదరాబాద్ లోని చౌమొహల్లా ప్యాలెస్‌లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం ముకరం జా బహదూర్ (మీర్ బర్కత్ అలీ ఖాన్) పార్థివదేహానికి సిఎం కెసిఆర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి, శాసనసభ్యులు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఈ. ఆంజనేయ గౌడ్, హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం తదితరులు ఉన్నారు.

‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ సంతాపం

హైదరాబాద్ 8వ నిజాం ప్రిన్స్ ముకరం జా మృతి పట్ల ఫో రం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ప్రగాఢ సంతాపం తెలిపింది. విద్య, వైద్యంలో ఈ ప్రాంతానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని, సమాజానికి ఆయన చేసిన సేవలు తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఫక్షరం ఫర్ ఎ బెట ర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ప్రఖ్యాత చౌమహల్లా ప్యాలెస్ యజమానిగా ప్రిన్స్ ముకరం జా బహదూర్, అతని కుటుంబం చేపట్టిన పునరుద్దరణ ప నులతో ఈ ప్యాలెస్ ను చక్కగా చెక్కు చెదరకుండా కాపాడటంతో 2010లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ విభాగ పు యునెస్కో ఆసియా పసిఫిక్ మెరిట్ ఆవార్డును పొందిందని తెలిపారు. ఆయన మరణం వారసత్వ ప్రేమికులకు తీరని లోటని, ప్రిన్స్ ముకరం జా బహదూర్ కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News