న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మహిళలు ఎవరికి ఓటు వేస్తే మంచిదో తమ కుటుంబంలోని పురుషులతో చర్చించాలంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. శనివారం ఉదయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలుకాగా పోలింగ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశారు. హిందీలో ఆయన చేసిన ట్వీట్ ఇలా ఉంది.. ఓటు వేసేందుకు తప్పకుండా వెళ్లండి. మహిళలందరికీ నా విన్నపమేమిటంటే…ఇంటి బాధ్యతలు ఎలా మోస్తున్నారో ఢిల్లీ రాష్ట్ర బాధ్యత కూడా మీ భుజాలపైన ఉంది. మహిళలంతా ఓటు వేయడానికి వెళ్లడంతోపాటు మీ ఇంట్లోని పురుషులను కూడా తీసుకెళ్లండి. ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందో మీ కుటుంబంలోని పురుషులతో చర్చించండి…అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ వెంటనే స్పందిస్తూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే సమర్థత మహిళలకు లేదని భావిస్తున్నారా అంటూ కేజ్రీవాల్కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ప్రధానంగా పోటీ ఆప్, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే ఉంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలను గెలుచుకోగా బిజెపి 3 స్థానాలకే పరిమితమైంది.