Saturday, April 20, 2024

నీరజ్, మిథాలీలకు ఖేల్ రత్న అవార్డులు

- Advertisement -
- Advertisement -

Khel Ratna Awards for Neeraj and Mithali

ధావన్, అంకితలకు అర్జున పురస్కారాలు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో సహా మొత్తం 12 మంది క్రీడాకారులకు ప్రతిష్టాత్మకమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం వరించింది. అంతేగాక ఈ ఏడాది మరో 35 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ప్రతి ఏడాది ఖేల్ రత్న, అర్జున అవార్డులతో సత్కరించడం అనవాయితీగా వస్తోంది. ఇక ఈసారి ఏకంగా 12 మంది క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులను ప్రకటించారు. వీరిలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు స్టార్ మహిళా క్రికెటర్, తెలుగుతేజం మిథాలీ రాజ్, రెజ్లర్ రవికుమార్, బాక్సర్ లవ్లీనా బొర్గొహెన్, హాకీ ఆటగాడు శ్రీజేష్, పారా షూటర్ అవనీ లెఖరా, పారా అథ్లెట్ సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నగర్ (పారా బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్ (పారా షూటింగ్), సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)లకు ప్రతిష్టాత్మకమైన ఖేల్ రత్న అవార్డులు దక్కాయి.

ఇక క్రికెటర్ శిఖర్ ధావన్, సిమ్రన్‌జీత్ కౌర్ (బాక్సింగ్), అర్పిందర్ సింగ్ (అథ్లెటిక్స్), వందన (హాకీ), మోనికా (హాకీ), దీపక్ పునియా (రెజ్లింగ్), అంకిత రైనా (టెన్నిస్), భవానీ దేవి (ఫెన్సింగ్), అభిషేక్ వర్మ (షూటింగ్) తదితరులకు అర్జున అవార్డులు దక్కాయి. మరోవైపు కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డులు ఈసారి ఐదుగురికి వరించాయి. రాధాకృష్ణన్ (అథ్లెటిక్స్, సంధ్య గురుంగ్ (బాక్సింగ్), ప్రితమ్ సివాచ్ (హాకీ), జైప్రకాశ్ (పారా షూటింగ్), సుబ్రహ్మణ్యం (టిటి)లకు ఈ అవార్డులు దక్కాయి. ఇక లేఖ (బాక్సింగ్), అభిజీత్ కుంతె (చెస్), దవీందర్ సింగ్ (హాకీ), వికాస్ కుమార్ (కబడ్డీ), సజ్జన్ సింగ్ (రెజ్లింగ్)లకు ప్రతిష్టాత్మకమైన ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News