కిడ్ ఆఫ్ది ఇయర్ గీతాంజలిరావు
15 ఏళ్ల స్కూల్ బాలిక
10 విశేషాంశాల మాలిక
న్యూయార్క్ : ప్రపంచ స్థాయి బాలశాస్త్రవేత్తగా గుర్తింపు పొందింది. ఈ ఏటి ప్రఖ్యాత టైమ్ మేగజీన్ కిడ్ ఆఫ్ది ఇయర్గా నిలిచింది. టైమ్ ముఖచిత్ర కథనంతో వెలుగొందిన 15 ఏండ్ల బాలిక గీతాంజలి రావు మానవాళిని పట్టిపీడిస్తోన్న కలుషిత నీటి సమస్య పరిష్కారానికి పాటుపడింది. బాల శాస్త్రవేత్తల స్థాయిలో తొలిసారిగా మేటి సైంటిస్టుగా గీతాంజలికి గుర్తింపు దక్కడం చిన్ననాటి నుంచే ఆమె కనబరుస్తూ వస్తున్న సృజనాత్మకత , పరిశోధనా పాటవాలకు గుర్తింపుగా నిలిచింది. ఎంచుకున్న జటిల సమస్యలు వాటికి పరిష్కారాల కోసం ఈ చిన్నమ్మాయి తన చిట్టి మెదడులోని అపార ప్రతిభతో అత్యద్భుతాలే సృష్టించింది. కొలరాడోలోని డెన్వర్ ప్రాంతపు రాంచ్లోని స్టెమ్ స్కూల్ విద్యార్థిని అయిన గీతాంజలి రావు తనకు దక్కిన గుర్తింపుపై స్పందించారు.
ఇది తనకు అమితాశ్చర్యం కల్గించిందన్నారు. కిడ్ ఆఫ్ది ఇయర్గా ఎంపికచేసినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది. దీనిని రాబోయే తరాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. భావి తరం ఆలోచనలు, చేతల్లోనే ప్రపంచ భవిత ఆధారపడి ఉందని గర్వంగా తెలిపింది. ఈ భారతీయ సంతికి చెందిన బాలిక గురించి పలు విశేషాలు ఉన్నాయి.
1) గీతాంజలి తన 12వ ఏటనే నీళ్లలో సీసపు అవశేషాలను గుర్తించే పోర్టబుల్ పరికరాన్ని రూపొందించింది. ఫ్లింట్, మిచిగాన్ వంటి ప్రాంతాలలో తాగునీటి సంక్షోభం తనను ఈ ఆవిష్కరణకు పురికొల్పిందని స్వయంగా ఈ అమ్మాయే నటి,టైమ్ కాంట్రిబ్యూటింగ్ ఎడిటర్ అంజెలీనా జోలికి తెలిపింది.
2) పదేళ్ల వయస్సులోనే నీళ్లలో రసాయనాలను పసికట్టే కార్బన్ మోనోట్యూబ్ సెన్సార్ రూపకల్పనకు కృషి చేసింది. డెన్వెర్ వాటర్ క్వాలిటీ రిసర్చ్ లాబ్లో ఇందుకోసం ప్రయత్నాలు చేయాలని సంకల్పించింది. తొలి దశలోనే ఒపియం ఇతరత్రా మాదకద్రవ్యాల వ్యసనాలను గుర్తించి అరికట్టే ఎపియోనె పరికరాన్ని తయారు చేసింది.
3) సైబర్ నేరాలను అరికట్టేందుకు కృత్రిమ మేథ సంబంధిత యాప్ పరికరాన్ని రూపొందించింది. ఈ యాప్ సాయంతో సైబర్ పరిభాషను చిన్నపిల్లలు కూడా పసికట్టి తగు విధంగా హెచ్చరికలు జారీ చేసేందుకు వీలేర్పడింది.
4) ఇతర ప్రతిభాయుత విద్యార్థులకు ఉపయోగపడేందుకు గీతాంజలిరావు గ్రామీణ స్కూళ్లలో, మ్యూజియంలలో , సైన్సు, సాంకేతిక రంగ,ఇంజనీరింగ్ , గణిత శాస్త్ర సంస్థలతో కలిసి పనిచేసింది. పలు వర్క్షాప్ల నిర్వహణలో తన వంతుగా కీలక బాధ్యతలు నిర్వర్తించింది.
5) మార్వెల్స్ హీరో ప్రాజెక్టుకు చెందిన వెబ్ సీరిస్ జీనియస్ గీతాంజలిలో ఆమె పాల్గొంది. సైంటిస్టు కావడం అంటే సూపర్హీరోగా గుర్తింపు పొందడమే. సూపర్హీరోల మాదిరిగా సైంటిస్టులు కూడా తమ వినూత్న ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేస్తారని తెలిపింది. ఇంతకంటే ఉత్తేజభరిత ఘట్టం చిన్నపిల్లలకు మరోటి ఉంటుందా? అని ప్రశ్నించింది.
6) హైస్కూల్ విదార్థిని అయిన గీతాంజలి ఫోర్బ్ 30లో చోటు దక్కించుకున్నారు. పలు టెడ్ ఈవెంట్స్లో పాల్గొన్నారు.
7) పలు పురస్కారాలు పొందిన కుమారి రావు ఎపిఎ ప్రెసిడెన్షియల్ అవార్డు, జార్జి స్టీఫెన్సన్ ఇన్నోవేషన్ అవార్డు, కుమన్ స్ఫూర్తిప్రదాతల పురస్కారం, టిసిఎస్ ఇగ్నైట్ టాప్ హెల్త్ పిల్లర్ అవార్డు వంటివి చిన్ననాటనే పొందారు.
8) ఆమె పలు శాస్త్రీయ విషయాలపై రచనలు కూడా చేశారు. ఎ యంగ్ ఇన్నోవేటివ్ గైడ్ టు స్టెమ్ వ్యాసాన్ని సైమన్ అండ్ షూస్టెర్ ఈ ఏడాది మార్చిలో ప్రచురించింది.
9) తన చిన్నారి తమ్ముడి ఆసక్తిరమైన ఆరాలు, వెలిబచ్చు సందేహాలను తీరుస్తూ బేబీ బ్రదర్ వండర్స్ అనే రచన చేసింది.
10) బేకరి తినుబండరాలు వంటలు చేయడంలో కూడా గీతాంజలి చేయి తిరిగింది. 15 ఏండ్ల వయస్సు అమ్మాయిలు ఏమి చేస్తారో వాటన్నింటిని తాను వారిని మించి చేస్తానని తెలిపింది. ఈ మధ్యకాలంలో కరోనా ఉధృతి దశలో అంతా ఇళ్లకు పరిమితం అయినప్పుడు తాను బేకరీ ఉత్పత్తులకు దిగి బాగానే వెనుకేసుకువచ్చానని తెలిపింది. రుచితో పోలిస్తే ఎక్కువగానే దక్కింది. అంత బాగా లేదన్పించింది. అయితే బేకింగ్ అనేది కూడా శాస్త్ర మిళితమే, ఇందులో కూడా సూక్ష్మంగా శాస్త్రం కలిసి ఉంటుంది. తోటి వయస్సు వారు చేసే పనులు చిలిపిచేష్టలు చేతనవునా అనే నటి జోలి ప్రశ్నకు తన సమాధానంలో కూడా గీతాంజలి సైన్స్ను మిళితం చేసింది.