న్యూఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసిందని, అలాగే ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ సిఫార్సులు చేసిందని ఇవన్నీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. గురువారం లోక్సభలో ప్రదీప్ కుమార్ సింగ్ అనే సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్నికలు తరచూ జరగడం వల్ల సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతోపాటు వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడుతోంది. అన్ని ఎన్నికలూ ఏక కాలంలో జరిపితే ఏటేటా వాటి నిర్వహణ వ్యయభారం తగ్గిపోతుందని న్యాయ వ్యవ హారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తన 79 వ నివే దికలో పేర్కొంది. ఎన్నికల సంఘంతో సహా వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగు సిఫార్సులు చేసింది. అవన్నీ పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచి స్తూ లా కమిషన్కు పంపగా, విభిన్న వర్గాలతో సంప్ర దించిన తరువాత ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసిందని మంత్రి చెప్పారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5814 కోట్ల నిధులు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
ఆధార్ ఓటరు కార్డు అనుసంధానం
నకిలీ ఓటర్లను అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డు ఆధార్లను అనుసంధానం చేయాలని ప్రతిపాదించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా వివ రించారు. నేరాభియోగాలు నమోదైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించడం, వ్యయ నియంత్రణ, ఒపీనియన్ పోల్స్, చెల్లింపు వార్తలపై నిషేధం లాంటి ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ రెండు నివేదికలు ఇచ్చిందని చెప్పారు.
Kiren Rijiju respond on Jamili Elections in Parliament