మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు సిఎఎలో లేవని కేంద్రం పలుమార్లు చెప్పినప్పటికీ విపక్షాలు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా మోదీని, బిజెపిని ఎదుర్కోలేక విపక్ష పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. సిఎఎలో మైనార్టీలకు నష్టం చేకూర్చే అంశం ఒక్కటీ లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని మైనార్టీ ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కుటుంబసభ్యులతో అమెరికా అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తే సిఎఎ పేరుతో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం తగదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయని, ఎవరికి నష్టం కలిగిందని సభలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని కిషన్రెడ్డి డిమండ్ చేశారు. ఏ పార్టీ అయినా.. ఏ సంస్థ అయినా హింసకు పాల్పడితే విడిచిపెట్టే ప్రసక్తి ఉండదన్నారు. సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Kishan Reddy fires on Asaduddin over CAA Protest