ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా కెఎల్.రాహుల్ను భారత క్రికెట్ బోర్డు నియమించింది. అంతకుముందు రోహిత్ శర్మను సిరీస్లో వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే గాయం వల్ల రోహిత్ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లికి డిప్యూటీగా రాహుల్ను నియమించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు శనివారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వన్డేల్లో, టి20 ఫార్మాట్లో రాహుల్ టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. తాజాగా టెస్టుల్లో కూడా అతనికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు టెస్టుల్లో అజింక్య రహానె వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ సౌతాఫ్రికా సిరీస్లో రహానెను ఈ బాధ్యతల నుంచి బిసిసిఐ తొలగించింది. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను టెస్టుల్లోనూ వైస్ కెప్టెన్గా నియమించింది.
కానీ గాయంతో అతను సిరీస్కు దూరం కావడంతో తాజాగా రాహుల్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. విరాట్ కోహ్లికి అతను డిప్యూటీగా వ్యవహరిస్తాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్లో రాహుల్ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం పంజాబ్ ఫ్రాంచైజీ రాహుల్ను వదిలేసింది. అతన్ని అట్టి పెట్టుకునేందుకు పంజాబ్ టీమ్ యాజమాన్యం ఆసక్తికనబరచలేదు. అయితే తాజాగా రాహుల్కు టెస్టుల్లో కీలకమైన వైస్ కెప్టెన్ బాధ్యతలు దక్కాయి. దీన్ని అతను ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక రాహుల్ ఇప్పటి వరకు 40 టెస్టులు ఆడిన రాహుల్ 35.16 సగటుతో 2321 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, మరో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు వన్డే ఫార్మాట్లో కూడా రాహుల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. మరోవైపు సౌతాఫ్రికాతో భారత్ మూడు టెస్టులు, మరో మూడు వన్డేలు ఆడనుంది. తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.