ముంబై: ప్రపంచ క్రికెట్లో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగిందంటే దానికి సమష్టికృషినే కారణమని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బిసిసిఐ ముందు చూపుతో వ్యవహరిస్తూ భారత క్రికెట్ను ఎంతో బలోపేతంగా మార్చిందన్నాడు. దీనికి కోచ్లతో పాటు కెప్టెన్, జట్టు సభ్యుల కృషి దాగివుందన్నాడు. సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరే ముందు కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి శాస్త్రి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టుకు సంబంధించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్కు చేరడంలో యువ ఆటగాళ్ల పాత్ర చాలా కీలకమన్నాడు.
ప్రతికూల పరిస్థితుల్లో కుర్రాళ్లు అసాధారణ ఆటతో జట్టుకు అండగా నిలిచారని, దీనికి సీనియర్ల సహకారం కూడా తోడు కావడంతో భారత్ ఫైనల్కు చేరుకోగలిగిందన్నాడు. మరోవైపు డబ్లూటిసి ఫైనల్ను బెస్ట్ ఆఫ్3 ఫార్మాట్లో నిర్వహిస్తే బాగుండేదని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ తమకు సవాల్ వంటిదేనని కెప్టెన్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అయితే తాము మాత్రం గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతామని స్పష్టం చేశాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో జట్టు సమతూకంగా మారిందన్నాడు. ట్రోఫీని సాధించడమే లక్షంగా పెట్టుకున్నామని కోహ్లీ పేర్కొన్నాడు.
Kohli and Ravi Shastri press Conference