Saturday, April 20, 2024

విరాట్ కోహ్లికి షాక్

- Advertisement -
- Advertisement -

Kohli dropped to 15th position in ICC rankings

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి షాక్ తగిలింది. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి 15వ స్థానానికి పడిపోయాడు. ఒకప్పుడూ టి20లలో టాప్3లోనే కొనసాగిన కోహ్లి అనూహ్యంగా టాప్10 నుంచి వైదొలగాడు. కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం కోహ్లి ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లి ఏకంగా ఐదు ర్యాంక్‌లు కోల్పోయి 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక కోహ్లి సమకాలికూడిగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బాబర్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా ఆటగాళ్లలో ఒక్క కెఎల్.రాహుల్ మాత్రమే టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రాహుల్ పదో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు.

సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ అర్ధ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్ టాప్20లో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో ఏకంగా 27 స్థానాలు మెరుగు పరుచుకుని 18వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. లంక సిరీస్‌లో అయ్యర్ 174 స్ట్రయిక్‌రేటుతో ఏకంగా 204 పరుగులు చేసి విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన అతనికి ఎంతో కలిసి వచ్చింది. దీంతో ఏకంగా 18వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 17వ ర్యాంక్‌లో నిలిచాడు. కాగా, వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండో, జస్ప్రీత్ బుమ్రా పదో ర్యాంక్‌లో నిలిచారు. టెస్టు ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ రెండో, రవీంద్ర జడేజా మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News