Saturday, April 20, 2024

ఎగసిపడే గోదారికి కొండపోచమ్మ పేరు

- Advertisement -
- Advertisement -

kondapochamma project

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కృతం కానున్నది. గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ) నుంచి వివి ధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో పడతాయి. 15 టిఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయం సరిగా సాగకుండా ఎడారిగా మారిన కరువు ప్రాంతాలకు నీరు చేరుతుంది.

అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండ పోచమ్మ దేవాలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంటుంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మిం చే అతి పెద్ద రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండపోచమ్మ సాగర్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ నామకరణం చేశారు. కొండ పోచమ్మకు ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో భక్తులున్నారు.

నిత్యం వచ్చి పూజలు చేస్తారు. తమను చల్లగా చూసే దేవతగా పేరుంది. కొండ పోచమ్మ సాగర్ కూడా ఈ ప్రాంత వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ అమ్మవారి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును ఓ దేవాలయం మాదిరిగా భావిస్తున్న కెసిఆర్, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉద యం 7 గంటలకు సిఎం కెసిఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సిఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండ పోచమ్మ సాగర్‌కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో పంపుహౌజు వద్దకు చేరుకునే చినజీయర్ స్వామికి కెసిఆర్ స్వాగతం పలుకుతారు.

అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌజ్ ప్రారంభం చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం చినజీయ స్వామికి వీడ్కోలు పలుకుతారు. ఆహ్వానించిన కొద్ది మంది అతిథులకు అక్కడే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు

రేపు (శుక్రవారం) సిద్దిపేట జిల్లా మర్కూక్ సమీపంలో నీటి పారుదల శాఖలో చరిత్రాత్మకంగా నిలువనున్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు సిఎం కెసిఆర్ ప్రారంభించనున్న కారణంగా అక్కడ భారీఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. బుధవారం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, కలెక్టర్ వెంకట్రాం రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎంపిలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, కార్యకర్తలు భారీగానే హాజరయ్యే అవకాశముంది. దీన్ని బట్టి అవసరమైన ఏర్పాట్లను చేయాలని, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

ప్రాజెక్టు సమీపంలో నేరుగా హెలీకాప్టర్ ద్వారా సిఎం కెసిఆర్ దిగనున్న కారణంగా అక్కడ నిర్మించే హెలీప్యాడ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. పంపు హౌజ్ ను , వాహనాల పార్కింగ్, వివిఐపిలు, విఐపిలు, ఇతరులకు ఏర్పాటు చేయనున్న భోజనాల స్థలాన్ని, మర్కూక్ వద్ద రైతు వేదిక స్థలాన్ని మంత్రి హరీష్ రావు ,కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, పోలీస్ కమీషనర్ జోయెల్ డేవిస్,ఎంపి ప్రభాకర్ రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజాంమిల్ ఖాన్, తదితర అధికారులలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు వారికి తాను కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమం సజావుగా జరగటానికి అవసరమైన అన్నిఏర్పాట్లను తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News