మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు ఎసిబి కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గత నెల 28న విచారణకు హాజరుకావాల్సిందిగా మే 26వ తేదీన కెటిఆర్కు ఎసిబి నోటీసులు పంపించగా, ఆ సమయంలో కెటిఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఎసిబికి కెటిఆర్ సమాచారం ఇచ్చారు.
దానికి అంగీకారం తెలిపిన ఎసిబి.. ఇటీవల మరోసారి కెటిఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గతంలో ఒకసారి కెటిఆర్ ఎసిబి, ఇడి ముందు విచారణకు హాజరయ్యారు. జనవరి 6వ తేదీన న్యాయవాదులతో కలిసి ఎసిబి విచారణకు వెళ్లిన కెటిఆర్ను అధికారులు అనుమతించకపోవడం తిరిగి వెళ్లిపోయారు. తిరిగి మరోసారి జనవరి 8న ఎసిబి విచారణ హాజరు కాగా, ఆ రోజు దాదాపు 7 గంటల పాటు ఆయనను ఎసిబి విచారించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఎసిబి ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే.
రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఎసిబి కేసు నమోదు
బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించా రు. అందులో రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఎసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురు పేర్లను ఎసిబి ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. ఎ1గా మాజీ మంత్రి కెటిఆర్, ఎ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, ఎ3గా హెచ్ఎండిఎ మాజీ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎసిబి ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఆ తరువాత జనవరిలో ముగ్గురిని వివిధ తేదీల్లో విచారించిన ఎసిబి.. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించింది. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని కూడా ఎసిబి చెప్పింది. తాజాగా రెండోసారి కెటిఆర్ను విచారించాలని ఎసిబి నిర్ణయించింది. కెటిఆర్ నోటీసులు జారీ చేసి సోమవారం విచారణకు రావాల్సిందిగా ఎసిబి నోటీసుల్లో పేర్కొంది.