Thursday, April 25, 2024

కళ్లాలపై కండ్లమంట..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంట కల్లాలను కడితే.. కేంద్రానికి ఎందుకు కడుపు మంట? అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనవిధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే…మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులంటే కేంద్రానికి చాలా చిన్న చూపు కనిపిస్తోందన్నారు. పైగా కల్లాల కోసం వినియోగించిన నిధులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కేంద్రం కోరడం సిగ్గుచేటన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కెటిఆర్ పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నది రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యంతరం చెప్పని మోడీ సర్కారు….. తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు బిఆర్‌ఎస్ తరఫున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు, వ్యవసాయానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా.. ఉపాధి హామీ పథకాన్ని దురుద్దేశపూర్వకంగా నీరుగార్చే కుట్రలు కొనసాగిస్తుందని విమర్శించారు.వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని… రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలతో వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. తెలంగాణ రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్ష కట్టిందన్నారు.

సాయం చెయ్యం….చెయ్యనియ్యం
రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయం అన్నట్టుగా కేంద్రం తీరుందని కెటిఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మతిలేని, కుట్రపూరిత చర్యలకు నిరసనగానే నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలకు చేపడుతున్నామన్నారు. ఇందులో రాష్ట్రంలోని రైతులంతా సహకరించాలన్నారు. బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న ఆందోళన కార్యక్రమాలకు రైతులంగా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంటల ఆరబోతకు కల్లాలను నిర్మించుకుంటే కేంద్రానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం కావాలనే రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. ఇంత మంచి కార్యక్రమం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని కెటిఆర్ ప్రశ్నించారు.

ధర్నాలు దద్దరిల్లాలి
కేంద్రం తీరును నిరసిస్తూ నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాలు దద్దరిల్లాలని పార్టీ శ్రేణులను కెటిఆర్ సూచించారు.వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కనపెట్టిన కేంద్రం మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను తీసుకొచ్చిందని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో కొవిడ్ కష్టకాలం తర్వతా ఉపాధి అవకాశాలు తగ్గాయనిన్నారు. గ్రామీణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు. మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు.

నిధులను వెనక్కి ఇవ్వమని అడగడం దారుణం
రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణం కి ఖర్చయిన రూ. 151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి టీసు ఇవ్వడంపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షేనని అని అన్నారు. రాష్ట్రంలో రైతులు కట్టుకున్న వ్యవసాయ కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా…. తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదే తరహా సిమెంట్ కల్లాలను ఉపాధి హామీ పథకంలో భాగంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసినా పట్టించుకోని కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో రైతులు నిర్మించుకున్న కల్లాలపై మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు.

తెలంగాణ రైతులంటే కేంద్రానికి గిట్టదు
తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదని కెటిఆర్ ఆరోపించారు. కేవలం తెలంగాణ మీద వివక్షతోనే పనికిమాలిన షరతులను మోడీ సర్కారు తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. ఇందులో భాగంగా రూ. 750 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న 79000 వ్యవసాయ కల్లాల నిర్మాణాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఉపాధి హామీ పనులతో రైతులు ఉపయోగం జరిగితే తప్పా? అని కెటిఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని ఆయన తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకి నేరుగా డబ్బులు అందించే రైతు బంధు కార్యక్రమంతో మొదలుకొని రైతు బీమా, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధి హామీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్న తమ ప్రభుత్వ సదుద్దేశానికి మోడీ ప్రభుత్వం దురుద్దేశాలు ఆపాదిస్తోందని కెటిఆర్ విమర్శించారు.

కేంద్రం కక్ష కట్టింది
రాష్ట్ర వ్యవసాయ ప్రగతిపైన ఉన్న గుడ్డి వ్యతిరేకతతో కేంద్రం కక్ష కట్టిందని కెటిఆర్ విమర్శించారు. వ్యవసాయ రంగ అనుబంధ పనులకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్ర రైతులపై కక్ష సాధించేందుకు మాత్రమే నిధులు మళ్లింపు అంటూ మోడీ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా! అన్న కెటిఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన బిజెపి ప్రభుత్వం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని మరో కుట్రకు తెర లేపిందన్ననారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లాలు నిర్మిస్తే… ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడం సిగ్గుచేటని విమర్శించారు.

ఇదేనా రైతుల మీద బిజెపి ప్రభుత్వానికి ఉన్న ప్రేమా? అని ప్రశ్నించారు. కాగా కేంద్రం తీరుకు నిరనసగా బిఆర్‌ఎస్ తలపెట్టిన నేటి ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కెటిఆర్ పిలుపునిచ్చారు వీరితోపాటు బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News