Tuesday, March 19, 2024

‘టిఎస్ ఐపాస్’తో విప్లవాత్మకమైన విధానం వచ్చింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు టిఎస్ ఐపాస్ ద్వారా విప్లవాత్మకమైన విధానం వచ్చిందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడలో పొకర్ణ ఇంజనీర్ స్టోన్ లిమిటెడ్ క్వాంట్రా క్వార్ట్జ్ రెండవ యూనిట్ ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి కెటిఆర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలుగా పారిశ్రామికీకరణ రంగంలో తెలంగాణ భారతదేశంలో ముందుందని, సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతో కూడిన ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా పల్లెల్లో పల్లె ప్రగతి, పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతుందని అన్నారు.

రాష్ట్రంలో ఒకవైపు పారిశ్రామికీకరణకు ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధి కల్పనకు అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, కులవృత్తులకు ప్రాధాన్యతను కల్పిస్తుందని, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు కలిసికట్టుగా ముందుకు నడిచినప్పుడు సమతుల్యమైన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం వచ్చిందని.. తెలంగాణలో పరిశ్రమ స్థాపించాలంటే ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ టిఎస్ ఐపాస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని అన్నారు. టిఎస్ ఐపాస్ వచ్చినప్పటి నుండి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు. నిరుద్యోగులకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. మేక గూడ లో పరిశ్రమ స్థాపించిన పోకర్ణ ఇంజనీర్ స్టోన్ పరిశ్రమ యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.

KTR launched second unit of quantra quartz

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News