Friday, April 19, 2024

నల్లగొండకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

రూ.1544కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

మున్సిపాల్టీల అభివృద్ధికి 10 పాయింట్ల ఎజెండా, మాస్టర్‌ప్లాన్
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్
నలుగురు మంత్రులతో కలిసి శాఖల వారీగా అభివృద్ధి ప్రణాళికలు

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోట్లతో రాబోయే 6, 7 నెలల కాలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం ఆయన మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో క లిసి మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమ సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సమీక్షలో పల్లె ప్రగతి, ప ట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, ఉపా ధి హామీ, విద్యుత్, మిషన్ భగీరథ, రోడ్లు, డబు ల్ బెడ్ రూమ్ ఇండ్లు, గిరిజన సంక్షేమం, మహి ళా శిశు సంక్షే మం, నీటి తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.334 కోట్లు, రోడ్లు అభివృద్ధి కోసం రూ.402 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ.700 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం 100 కోట్లు, విద్యుత్ సబ్ స్టేషన్లకు 8 కోట్లు కలిపి మొత్తము 1544 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, అంతే కాకుండా వివిధ శాఖల ద్వారా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో నియోజకవర్గాలలో వేలకోట్ల రూపాయలతో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టినున్నట్లు తెలిపారు.

అలాగే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి, 175 కోట్లతో గ్రామీణ అభివృద్ధి, 30 కోట్లతో చండూరు మున్సిపాలిటీని, 50 కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రకటించారు. మునుగోడులో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు, చండూరును రెవిన్యూ డివిజనుగా ఏర్పాటు చేస్తామని అన్నారు.సంస్థాన్ నారాయణపురం మండలంలో ఒక గిరిజన పాఠశాలను ఏర్పాటు చేస్తామని, అలాగే కోటి రూపాయల ఖర్చుతో బంజారా భవన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దండు మల్కాపురం వద్ద 100 ఎకరాలలో పదివేల మందికి ఉపాధి కల్పిస్తూ టాయ్ పార్కు ఏర్పాటు చేస్తామని, పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున పట్టణాభివృద్ధి ప్రణాళిక బద్ధంగా జరగాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, దీనికి అనుగుణంగా ప్రజాప్రతినిథులు, అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. గత 8 సంవత్సరాలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీలకు 454 కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి పనులను చేపట్టినామని అన్నారు.

ఉమ్మడి జిల్లాలో నల్లగొండ అర్బన్ అథారిటీ, యాదాద్రి భువనగిరి జిల్లాలో వై.టి.డి.ఏ. అథారిటీలతో పాటు 19 మున్సిపాలిటీలలో వచ్చే మార్చి 31లోగా అభివృద్ధి కార్యక్రమాలను ఒక లక్ష్యంతో పూర్తి చేసుకోవాలని ఆన్నారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు 26 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్నాయని, దీనిని బట్టి దేశంలోనే మన మున్సిపాలిటీల పని విధానం తెలుసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరం పది పాయింట్ల ఎజెండాతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.చిన్న, పెద్ద మున్సిపాలిటీలలో టిఎస్‌బిపిఎఎస్‌ఎస్ భవన నిర్మాణాలకు 21 రోజులలోపే అన్ని అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, 75 చదరపు అడుగులు ఉంటే ఏ అనుమతులు అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీలో ఒక్కటైనా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఉండాలని, వచ్చే మార్చి 31 లోగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో అంతిమ సంస్కారాన్ని సంస్కారవంతంగా నిర్వహించేందుకు వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

హైదరాబాదుతో సహా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో 1700 పైగా అర్బన్ నర్సరీలు పెట్టుకున్నామని, ఇందుకు పది శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగించుకుంటున్నామని, అవసరం ఉన్నచోట ఇంకా కొత్త నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక దోభీఘట్‌ల నిర్మాణం కోసం చర్యలు తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులలో చెత్త తొలగింపుకు బయోమైనింగ్ ప్రక్రియను స్టార్ట్ చేయాలని, ప్రతి మున్సిపాలిటీలో మానవ వ్యర్ధాల శుద్ధికరణ ప్లాంటును ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ తనదైన మాస్టర్ ప్లాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసుకోవాలని, కొత్త మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడ రోడ్డు వస్తుంది, ఎక్కడ చెరువులు ఉన్నాయనేది కూలంకషంగా పరిశీలించుకుని ఆమోదించి పంపాలని తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రతి ఇంటికి స్ట్రక్చర్ డిజిటల్ డోర్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్న మున్సిపాలిటీలలో ఉన్న సెలూన్ ల వివరాలు పంపాలని, వారికి కొంత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

మిషన్ భగీరథ లో భాగంగా ప్రతి ఇంటికి నీటిని అందించాలని, ఇంకా ఎక్కడైనా మంచినీరు అందని ప్రాంతాలు ఉంటే గుర్తించి వెంటనే మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్ ను నియమించడం జరుగుతుందని, 50 వేల జనాభాకు తక్కువ ఉన్న మున్సిపాలిటీలలో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్ ను నియమిస్తామని తెలిపారు. చేనేత రంగానికి సంబంధించి భువనగిరి, నారాయణపురం, గట్టుపల్, తేరేటిపల్లి లలో నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేత జౌలి శాఖ ద్వారా ఇస్తున్న యార్న్ పై 40 శాతం సబ్సిడీని వెంటనే అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దండు మల్కాపూర్ ఐటి పార్కు సందర్శన కోసం ప్రజా. ప్రతినిధులు స్టడీ టూర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి కోరిక మేరకు పోచంపల్లిలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల సమస్యను పరిష్కరించి రాబోయే మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో మల్టిపుల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, చెక్ డ్యాంలకు సంబంధించి ఎన్ని పనులకు ఎన్ని పనులు జరిగాయి, ఎన్ని జరుగుతున్నాయి, అలాగే కొత్త చెక్ డాములకు ప్రతిపాదనలు, పనుల పూర్తి వివరాల సమగ్ర నివేదికతో వారం రోజుల లోపు నివేదించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి, పూర్తికాని పనులను ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఎప్పటిలోగా పూర్తి చేసుకోవాలో నిర్ణయించడానికే ఈ సమావేశం మునుగోడులో జరుపుకుంటున్నట్లు తెలిపారు. పల్లె సీమలు ప్రగతిలో పోటీ పడుతున్నాయని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా చేసిన పనులను ప్రజలకు వివరంగా తెలిసేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, చేసిన ప్రగతిని ప్రజలకు వివరించాలని తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 907 కి.మీ. వెడల్పు గల సింగిల్ రోడ్డు పనులను డబుల్ రోడ్లుగా మార్చడం జరిగిందని, ఉమ్మడి జిల్లాలో 69.9 కోట్ల విలువగల 70 రోడ్డు పనులు టెండర్ స్టేజీలో ఉన్నాయని, మునుగోడు నియోజకవర్గంలో 136 కి.మీ. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా చేయడం జరిగిందని తెలిపారు.

చిట్యాల నుంచి రామన్నపేట రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరయ్యాయని, పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీరాజ్ పనులలో భాగంగా పిఎంజిఎస్‌వై కింద సిసి రోడ్ల పనులకు రూ.209 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, సిఆర్‌ఆర్ కింద రూ.19 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. రోడ్ల పనులు, మరమత్తులు, పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన పంచాయతీలు, తండాలు జిపిలుగా ఏర్పాటైన చోట రోడ్లు వేసేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఐటిడిఏ పరిధిలో రూ.476 కోట్లతో అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా కు సంబందించి శాసన సభ్యులు ప్రతిపాదనలు ఇస్తే మంజూరు చేస్తామని అన్నారు.

జిల్లాలోని పరిశ్రమలు,ఫాక్టరీలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించి నప్పుడు రోస్టర్ పాటించాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురంలో గురుకులం మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఎలు సైదిరెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, రవీంద్ర కుమార్, ఎన్. భాస్కర్ రావు, నోముల భగత్, ఎంఎల్‌సి పల్లా తదితరులు పాల్గొన్నారు.

KTR Meeting for Development Works in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News