కేంద్ర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
గురువారం నాడు ప్రగతిభవన్లో
తనను కలుసుకున్న సుబ్రహ్మణ్యంతో మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు గురువారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్న చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ నేడు ప్రగతి భవన్ లో మంత్రి కెటిఆర్ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకున్న చర్యలు, పెట్టుబడుల సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయనకు మంత్రి కెటిఆర్ వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం సాధించిన విజయాలకు కూడా అడ్వైజర్కు కూలంకషంగా చెప్పారు.
కాగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యతలను సుబ్రహ్మణ్యన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సుబ్రహ్మణ్యన్కు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్ ఐఎస్బిలో పనిచేస్తున్న నాటి నుంచి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో తనకు మంచి బంధం ఉందన్న కెటిఆర్, ఆయన ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.