Friday, April 19, 2024

మాది ‘పోగు’బంధం

- Advertisement -
- Advertisement -

కొన ఊపిరితో ఉన్న ఈ రంగంపై జిఎస్‌టి వేయడం ఎందుకు?
కేంద్రం సహకరించకపోయినా…సిఎం కెసిఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు
రాష్ట్ర నేతన్నల సంక్షేమాన్ని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు
అందుకే రైతుబీమా తరహాలో నేత కార్మికుల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
పీపుల్స్‌ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : చేనేత రంగానికి జిఎస్‌టి రూపంలో కేంద్ర ప్రభుత్వం మరణశాసనం రాస్తోందని రాష్ట్ర ఐటి, చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం…అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే చేనేత రంగం కొన ఊపిరితో కొట్టుమిట్టాతోందన్నారు. ఈ పరిస్థితిలో చేనేత రంగంపై పన్నులు విధించాలను కోవడం ఎంత వరకు సమంజసమో కేంద్రం పెద్దలకే తెలియాలన్నారు. ఈ రంగానికి కేంద్రం ఏ మాత్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రైతు బీమా తరహాలో నేత కార్మికులకు బీమా సౌకర్యం నేటి నుంచి అమలులోకి తీసుకొచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలన్నారు. అందుకే నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ బీమా పథకం ద్వారా రాష్ట్రంలో 80వేల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు నేత కార్మికుడు చనిపోతే పది రోజుల్లో 5లక్షల బీమా నామినికి అందిస్తామన్నారు. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడన్నారు. చేనేతను ప్రోత్సహించేందుకు ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం నేత వస్త్రాలనే ధరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ…చేనేత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, చేనేత, మరమ్మగాల కార్మికుల కోసం బీమా పథకాన్ని తీసుకువచ్చిన సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే కెసిఆర్ వంటి నికార్స్‌అయిన వంటి దేశానికి వ్యక్తి ఎంతో అవసరమన్నారు.

అలాంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం వల్ల చేనేత కార్మికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చరకాను ఒక సింబల్‌గా తీసుకొని.. నూలును వడుకుతూ ఆ రోజుల్లో జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మహాత్మా గాంధీ చరకా పట్టి, నూలు వడికితే ఆ నాడు జాతి మొత్తం కదిలిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో భారత ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జిఎస్‌టి విధించడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో చేనేత రంగంపై పన్నులను వెంటనే రద్దు చేయాలని చేతులు జోడించి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

శుభ పరిణామం

దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు బీమా పథకానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం అని కెటిఆర్ అన్నారు. కేవలం ఇదొక్కదే కాదని… చేనేత, మరమగ్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. చేనేత మిత్రద్వారా 50శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా చూస్తున్నామన్నారు. ఈ సంవత్సరం టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదపడుతున్నాయన్నారు. నేతన్న బీమా పథకాన్ని ఆషామాషీగా కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ద్వారా బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎల్‌ఐసి అధికారులకు బీమాకు సంబంధించి చెక్కు అందజేసినట్లు వెల్లడించారు.

నోడల్ ఏజెన్సీగా చేనేత చేనేత, జౌళి శాఖ

నేతన్నకు బీమా పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు భారత జీవితబీమా సంస్థ – ఎల్‌ఐసీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కెటిఆర్ వివరించారు. ప్రీమియం కోసం రూ.50కోట్లు కేటాయించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేసినట్లు కెటిఆర్ తెలిపారు. సుమారు 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్నబీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన చేనేత, పవర్ లూం కార్మికులు, అనుబంధ కార్మికులందకీ నేతన్నబీమా పథకాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుందని….తద్వారా వారి కుటుంబాలకు భరోసాకు నిలుస్తుందన్నారు.

ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్

చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016….-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ (బిసివెల్ఫేర్ నుండి) రూ. 1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్‌కు ఇది అదనమన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ( 2022..,20-23) చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్ క్రింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ క్రింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ. 400 కోట్లు కూడా కేటాయించామన్నారు.

చేనేత మిత్ర స్కీం

చేనేత కార్మికులకు ముడి సరుకు కాటన్, సిల్క్, ఉన్ని, నూలు రంగు రసాయనాల కొనుగోలుపై 40 శాతం రాయితీని కల్పించడం జరుగుతోందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10శాతం రాయితీకి అదనమన్నారు. ఈ 40 శాతం రాయితీలో 35శాతం రాయితీ సబ్సిడీ డబ్బు చేనేత కార్మికుల అనుబంధ కార్మికుల వేతనాల పెరుగుదల రూపంలో నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలలోకి చేరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిగిలిన 5శాతం రాయితీ ముడి సరుకు కొనుగోలు దారులైన మాస్టర్ వీవర్స్ , వీవర్ సంఘాలకు, యూనిట్ల ఖాతాలకు విడుదల అవుతోందన్నారు. చేనేత మిత్ర పథకములో ఇప్పటివరకు 20,501 మంది లబ్దిదారులు రూ.24.09 కోట్ల
సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోకి వేశామన్నారు.

నేతన్నకు చేయుత

ఇంతకు పూర్వము ఉమ్మడి రాష్ట్రములో అమలు జరుగుచున్న సహకార త్రిఫ్ట్ ఫండ్ పథకములో చేనేత కార్మికులు వారి వేతనములో 8శాతం పొదుపు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము తరపున 8 శాతం జమ చేయడం జరిగేదన్నారు. ఈ పథకం కేవలం సహకార రంగములోని చేనేత కార్మికులకు మాత్రమే వర్తించేదన్నారు. కానీ టిఆర్‌ఎస్ ఏర్పడిన తరువాత చేనేత కార్మికుడు చెల్లించే 8శాతం త్రిఫ్టు పొదుపునకు రాష్ట్ర వాటాగా 16 శాతం జమ చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకమును 2017లో పోచంపల్లిలో ప్రారంభించడం జరిగిందన్నారు.

చేనేత కార్మికులకు ఋణ మాఫీ పథకం

చేనేత కార్మికుల యొక్క సామాజిక,ఆర్థిక బాగు కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తోందన్నారు. అయితే పోటీ ప్రపంచములో వారికి సహేతుకమైన మార్కెట్ లేనందున సరియైన ధరలు రాక వారు బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం లేదన్నారు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఋణవిముక్తులను చేయడం కోసమే ఋణమాఫీ పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోందనారు. ఈ పథకం కింద తీసుకున్న వర్కింగ్ కాపిటల్ వ్యక్తిగత రుణాలను ఒక లక్ష వరకు మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇందులో 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల ఋణము నుండి విముక్తి అయ్యారని వెల్లడించారు.

బాండ్ ప్రమోషన్,మార్కెటింగ్
చేనేత రంగములో నూతన డిజైన్లు, వస్త్రోత్పత్తి గురించి పరిశోధనలు మార్కెట్ గురించి అధ్యయనం జరుగుతోందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ పథకం అమలుకై ఇంతవరకు రూ.284.92 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇట్టి పరిశోధనలో భాగముగా తెలంగాణలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యము పొంది కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను వెలికితీసి వాటికి నవీనరీతులలో జోడించడం జరుగుతోందనారు. తద్వారా టిఎస్‌సిఒ పీతాంబరి పట్టు చీరలు, ఆర్మూరు పట్టు చీరలు, హిమ్రా చేనేతలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు లాంటి ఒకప్పటి గొప్ప కళాకృతులను పరిశోధించి తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకురావడం జరిగిందన్నారు

బతుకమ్మ చీరల ఉత్పత్తి
రాష్ట్రములోని మరమగ్గాల మాక్స్ యూనిట్ల నుండి బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగుతోందని కెటిఆర్ అన్నారు. ఈ చీరలను బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలో 18 సంలు నిండిన బిపిఎల్ మహిళలందరికి కానుకగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ పథకములో ప్రతిఏటా కోటి చీరల ఉత్పత్తి రాష్ట్రములోని మరమగ్గాలపై జరిపించి, యూనిట్ హోల్డర్స్, మరమగ్గాల కార్మికులకు పని కల్పించడం జరుగుతోందన్నారు.

మరమగ్గాల కార్మికులకు త్రిఫ్టు నిధి
ఈ పథకములో మరమగ్గాల కార్మికులు తమ వేతనములలో 8 శాతం పొదుపు ఖాతాకు జమ చేస్తే… రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 8శాతం డబ్బు జమ చేస్తోందన్నారు. ఈ పథకంలో మూడు సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్‌ను జీవో 58 ద్వారా వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా 4301 పవర్ లూమ్ కార్మికులకు రూ.12.07 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తము కోవిడ్ పరిస్థితుల్లో వారికెంతో ఉపయోగపడిందన్నారు. ఈ పథకం చాలా జనరంజకమైన కారణంగా వారి అభ్యర్ధన మేరకు తిరిగి (౩) సంవత్సరాలు పొడిగించడం జరిగిందన్నారు. దీని కోసం అదనపు బడ్జెట్ రూ.18 కోట్లు కేటాయించి, ఈ సంవత్సరమునకు రూ.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి ఎల్ . రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో సహా పలువురు పాల్గొన్నారు. సమావేశం ఆఖరులో సభకు హాజరైన అందరితో రమణ చేనేత వస్త్రాలను ధరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు నిర్వహించిన ఫ్యాషన్ షో ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News