నల్లాల ద్వారా తాగు నీటిని అందించడంలో తెలంగాణకు దరిదాపుల్లో మరే రాష్ట్రం లేదు
కేంద్ర జలశక్తి శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. నల్లాలతో తాగునీటిని అందించడలో తెలంగాణ రాష్టం మొదటి స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. 93.81 శాతం ఆవాసాలకు నల్లాలతో తాగునీటిని తెలంగాణ రాష్ట్రం నిరాటంకంగా అందిస్తోందన్నారు. ఈ విధంగా దేశంలో మరే రాష్ట్రం కూడా తాగునీటిని అందించలేకపోతు న్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ ప్రగతికి కేంద్రజల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల్ జీవన్ మిషన్ ఇటీవల వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని గురువారం మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. నల్లాలతో నీటిని అందించడంలో మన రాష్ట్రానికి సమీపంలో ఏ రాష్ట్రం కూడా నిలువలేకపోయిందన్నారు. నల్లా కనెక్షన్లలో దేశసగటు 27.28 శాతం ఉండగా.. 2.05 శాతంతో పశ్చిమ బెంగాల్ చివరి స్థానంలో ఉన్నది. ఈ అద్భుత విజయానికి కారణమైన సిఎం కెసిఆర్కు, కష్టపడి పనిచేచేసిన ఆర్డబ్ల్యూఎస్ టీమ్కు అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి కెటిఆర్ చెప్పారు. కాగా ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచిందన్నారు. మన రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఆవాసాలు ఉండగా 53.46 లక్షల ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నదని ఆయన తెలిపారు. కేంద్రజల్శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్ జీవన్ మిషన్ బుధవారం వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయాన్ని స్పష్టంచేసిందని మంత్రి కెటిఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా 1,897.93 లక్షల ఆవాసాలు ఉండగా 517.97 లక్షల ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నదన్నారు.
ఇది సరాసరి 27.28 శాతం మాత్రమేనని కేంద్ర జల్శక్తిశాఖ వెల్లడించింది. నల్లాలతో తాగునీరందించడంలో ఇతర ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేదని గణాంకాలలో స్పష్టంగా పేర్కొన్నదని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ తర్వాత 89.05 శాతంతో గోవా రెండోస్థానంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02శాతంతో మూడు, 79.78 శాతంతో హర్యానా నాలుగోస్థానంలో నిలిచాయన్నారు. కాగా, ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ 74.16శాతం ఆవాసాలకు మాత్రమే నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తూ ఐదోస్థానానికి పరిమితమయిందన్నారు.ఇక 2.05 శాతంతో దేశంలో చివరి స్థానంలో పశ్చిమబెంగాల్ నిలిచిందన్నారు. మిషన్ భగీరథతో సిఎం కెసిఆర్ చేసిన ప్రయత్నం ఫలించిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం సురక్షితమైన తాగునీటికి కూడా నోచుకోలేదన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైనా ఉమ్మడి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సిఎం కెసిఆర్ తాగునీటి సమస్యను మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నారన్నారు.. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేం దుకు ‘మిషన్ భగీరథ’ పథకానికి రూపకల్పన చేశారన్నారు.
దీనికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షలు చేశారన్నారు. నిర్ణత వ్యవధిలోగా మిషన్ భగరీథ కార్యక్రమం పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారని కెటిఆర్ తెలిపారు. 10 టిఎంసిల నదీజలాలను తాగునీటికి కేటాయించి రిజర్వాయర్ల నుంచి అన్నిగ్రామాలకు ప్రత్యేకంగా పైప్లైన్లు వేశారన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేస్తున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 54.38 ఆవాసాల్లో 53.46 లక్షల ఆవాసాలకు తాగునీరు అందుతున్నదని ఒక్క తెలంగాణలోనేనని అన్నారు. ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పలు రాష్ట్రాల అధికారులు తెలంగాణకు వచ్చి మిషన్భగీరథ పథకాన్ని అధ్యయనం చేసి వెళుతున్నారని కెటిఆర్ గుర్తు చేశారు.
KTR said Mission Bhagiratha was an ideal for Country