కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యల పరిష్కారం
వైద్య సేవలు, భూసంస్కరణలు, నూతన పాలనారీతులకు ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం
సమాజహితానికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం వ్యర్థం అన్న కెసిఆర్ మాటకు ఆచరణ రూపం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వర్చువల్ సదస్సులో మంత్రి కెటిఆర్
హైదరాబాద్:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించు కోబోతుందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిరామారావు అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూరప్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలోని ఏ దేశమైన వైద్య రంగానికి సంబంధించిన సరిపడా మౌలిక వసతుల కొరతను ఎత్తిచూపిందని అన్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు ఒక సహకార ధోరణితో గత సంవత్సర కాలంగా నిరంతరం శ్రమిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా లాంటి మహోమ్మారి పైన సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందని చెప్పారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి వరల్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నమెంట్ సమ్మిట్లో మంత్రి కెటిఆర్ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.
జపాన్ దేశం నుంచి వరల్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో రువాండాకు చెందిన ఐటి శాఖ మంత్రి పౌల ఇనగంబిరే,ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య, సాంకేతిక, టెక్నాలజీ కంపెనీల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సేవింగ్ లైఫ్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తమ ప్రభుత్వం ముందువరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. ముఖ్యంగా భూసంస్కరణలు, ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామన్నారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృధా అని తమ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆలోచనా విధానం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు, సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు పోతున్నామని తెలిపారు.