త్వరలో ప్రతి వార్డుకు రెండు చొప్పున ఏర్పాటు, మొత్తం 300 దవాఖానాలను ఏర్పాటు చేయడమే లక్షం
నగరంలో బస్తీదవాఖానాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
పలు ప్రాంతాల్లో దవాఖానాలను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రుల్లో లభించే వైద్యానికి దీటుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానా ల్లోనూ అందిస్తామని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు.పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న లక్షంతో జిహెచ్ఎంసి పరిధిలో పెద్దఎత్తున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం వైద్యమే కాకుండా రోగులకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపథ్యంలో వైద్యరంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే బస్తీ దవాఖాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని మంత్రి కెటిఆర్ వివరించారు. ఇప్పటికే జిహెచ్ఎసి పరిధిలో మొత్తం 170 బస్తీ దవాఖానాలు ఉండగా తాజాగా నేడు మరో 25 దవాఖాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి వివరించారు. ఈ సంఖ్యను రానున్న రోజుల్లో 300కు పెంచనున్నామన్నారు. ప్రతి వార్డుకు రెండు బస్తీ దవాఖానాలు ఉండే విధంగా చూస్తామన్నారు.
శుక్రవారం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మూద్ అలీ ప్రారంభించారు. హబ్సిగూడ డివిజన్లోని రామ్రెడ్డి నగర్లో బస్తీ దవాఖానాను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. మురికివాడల్లో నివసించే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా 2018 ఏప్రిల్ 6వ తేదీన తొలి తొలి బస్తీ దవాఖానాను ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం పేదలకు అవసరమైన వైద్య సేవలు బస్తీ దవాఖానాల్లో పెద్దఎత్తున అందుతున్నాయన్నారు. ప్రజలు కూడా వైద్య సేవలపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో చిన్నచిన్న ఆసపత్రులకు కూడా పేదలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేవారన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్ర భుత్వ ఆసుపత్రులకు పెద్ద చేయూతనిచ్చారన్నా రు. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ప్రధాన లక్షంగా బడ్జెట్లో ఆసుపత్రులకు పెద్దఎత్తున నిధులు కేటాయించారన్నారు. పెద్దఎత్తున డాక్టర్లను కూడా రిక్రూట్ చేసిందన్నారు. ఫలితంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు.
కొన్ని సందర్భాల్లో అయితే ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సైతం ఆశ్చర్యపోవే విధంగా ఎంతో క్రిటికల్ వైద్యానికి కూడా ప్రభుత్వ వైద్యులు చికిత్స చేసి విజయం సాధిస్తున్న దాఖాలాలు అనేకమున్నాయన్నారు. చిన్నచిన్న జబ్బులకు ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజలు వెళ్లడం లేదని మంత్రి తెలిపారు. వారంతా ప్రస్తు తం బస్తీ దవాఖానాల్లోని వైద్యులనే సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బస్తీ దవాఖానాల్లో సాధారణ వైద్య పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ బస్తీ దవాఖానా వల్ల 3వేల కుటుంబాలకు, సుమారు 12వేల మంది ప్రజలకు వైద్యసేవలు అందుతాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్కుమార్, ఎంఎల్ఎ భేతి సుభాష్రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని, ముషీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల, పాతబస్తీల్లోని పలు నియోజకవర్గాల్లో మహమ్మూద్ అలీ బస్తీదవాఖానాలను ప్రారంభించారు.
KTR starts Basthi Dawakhana in Habsiguda