Thursday, April 25, 2024

సత్వర అనుమతులు

- Advertisement -
- Advertisement -

వ్యాక్సిన్ల ప్రోక్యూర్‌మెంట్ పాలసీపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి
కోవిడ్ వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల్లో మరింత వికేంద్రీకరణ జరగాలి
వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి
క్లినికల్ ట్రయల్స్, తయారీ, అనుమతుల జారీలోనూ వేగంగా కదలాలి
వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన కంపెనీలకు కేంద్రం మరిన్ని నిధులివ్వాలి
ముందు వరుసలో ఉన్న కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
భారత దేశ బయోటెక్ రంగ అగ్రస్థానాన్ని కాపాడేలా తీసుకోవాల్సిన వ్యూహం పైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి
కేంద్ర ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసిన మంత్రి కెటిఆర్
ఆ లేఖలో పలు అంశాలపై ప్రస్తావన

KTR Writes to Central Health Minister Harshvardhan

మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ వాక్సిన్లు త్వరలో మార్కెట్‌లోని రానున్న నేపథ్యంలో వాటి ప్రొక్యూర్‌మెంట్ పాలసిపై కేంద్రం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలిజీ మంత్రి హర్షవర్ధన్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. తద్వారా వ్యాక్సింగ్ కొందరికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయనకు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మంత్రి కెటిఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను సవివరంగా ఆ లేఖలో వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉందని, ఇక్కడి నుంచి సుమారు 5 బిలియన్ డోసులు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ తయారవుతుందని వివరించారు. ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో ఒకటిలో మూడవ వంతుగా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాదన్నారు. ఆ దిశగా ఇప్పటికే ఫలవంతమైన భాగస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రం అందించిందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే నగరానికి చెందిన మూడు కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాయని త్వరలోనే వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న ఆశ ఉందన్నారు.

ఈ విషయం పట్ల తనకు గర్వంగా ఉన్నదని కేంద్రమంత్రికి రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీంతో పాటు అనేక ఇతర ఫార్మా కంపెనీలు సైతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందుల తయారీలో సైతం పాలుపంచుకుంటున్నాయని ఆయన తెలిపారు. గతవారం బయోటెక్ పరిశ్రమ వర్గాలతో తాను ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశీయంగా బయోటెక్ పరిశ్రమలు మరింత ఉన్నత స్థానాలకు తీసుకుపోయేందుకు ఈ రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలను… అందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడ ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు. అలాగే ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను సైతం ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో వెంటనే వ్యాక్సిన్ అనుమతులతో పాటు టెస్టింగ్ ట్రాకింగ్ వ్యవస్థను మరింతగా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. తద్వారా క్లినికల్ ట్రయల్స్ , వ్యాక్సిన్ల తయారీలో మరింత సులభంగా కంపెనీలు ముందుకు సాగే అవకాశముందన్నారు. దీంతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్ మద్దతు విషయాన్ని కూడా మంత్రి కెటిఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ లాబరేటరీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉందన్నారు. దీనిని బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటికీ అక్కడ కొనసాగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బయోటెక్ సంస్థలకు ఇబ్బందిగా మారిందన్నారు.

గతంలో లాక్ డౌన్ ఉన్నప్పుడు ప్రయాణ సౌకర్యాలు సరిగా లేనందు వలనే సెంట్రల్ డ్రగ్ లాబరేటరీకి శాంపిళ్లను పంపడంలో బయోటెక్ పరిశ్రమలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మరింత వేగంగా వ్యాక్సింగ్ తయారు చేసే ఉద్ధేశంతో కంపెనీలు పని చేస్తున్న నేపథ్యంలో వారికి కొంత సులభంగా అనుమతులు ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించాలన్నారు. ప్రస్తుతం ఇచ్చిన తాత్కాలికంగా వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని ఆయన కోరారు. ప్రపంచ బయోటెక్ రంగంలో భారత దేశాన్ని మరింత అగ్ర స్థానంలో నిలిపి అక్కడి పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతులు, క్లియరెన్స్‌ల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆ దిశగా వికేంద్రీకరణ కోసం కేంద్రం చర్యలు తీసుకొని సిడిఎస్‌సిఒ జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఈ జోనల్ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని కోరారు.. తద్వారా కంపెనీలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

భారతదేశంలో వాక్సిన్‌ల తయారీలో సుమారుగా 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ ఉంటుందని తెలిపిన మంత్రి కెటిఆర్, ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ కాంప్లెక్స్ ప్రక్రియను కొంతమేరకు సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సులభతరం చేస్తూ కఠినమైన నిబంధనలతోనే సులభంగా, ఆలస్యం కాకుండా వ్యాక్సిన్లు అనుమతి లభించే తీరుగా నూతన విధానాన్ని రూపకల్పన చేయాలని సూచించారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి లైసెన్సింగ్ ప్రక్రియపైన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌డిఎఎ వంటి సంస్థలు మార్గదర్శకాలను జారీ చేశారని ఈ గైడ్‌లైన్స్‌కు ప్రమాణాలకు అనుకూలంగా దేశీయంగా మార్గదర్శకాలను త్వరగా రూపొందించాలన్నారు.

వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ , తయారీపైన కూడా మంత్రి కెటిఆర్ పలు సూచనలు చేశారు. ఇప్పటికే రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న విషయాన్ని కేంద్రమంత్రికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించి నూతన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతోపాటు కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి పెట్టుకొని విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేసే విధంగా అవకాశం ఇవ్వాలన్నారు. తద్వారా విజయవంతమైన వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.
ఇప్పటికే పిఎం కేర్స్ నిధి ద్వారా సుమారు రూ. 100 కోట్లను వ్యాక్సిన్ తయారీ చేస్తున్న కంపెనీల కోసం కేటాయించిన నేపథ్యంలో వాటిని అందించే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఆయన కోరారు.

దీంతోపాటు వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్ ఇచ్చేలా నూతన నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. తద్వారా వేగంగా వాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంటుందని, ఈ విషయాలరై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రపంచ వాక్సిన్ తయారీ రంగంలో భారత్ లీడర్ పొజిషన్లో ఉన్నదని ఇలాంటి సంక్లిష్ట సమయంలో సరైన నిర్ణయాలు వేగంగా తీసుకోకుంటే ఆ పొజిషన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా అధికారులతో పాటు పరిశ్రమ వర్గాల తో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇకో సిస్టం మరింత బలోపేతం కావాలని కోరుకునే రాష్ట్రల్లో తెలంగాణ ఒకటన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సహకారం పరిశ్రమకుగానీ, కేంద్ర ప్రభుత్వానికిగానీ అందించేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగా ఉంటామని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.

KTR Writes to Central Health Minister Harshvardhan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News