ఈ నెల 31న కోడకండ్ల మండల కేంద్రంలో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్ : రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 31వ తేదీన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభిస్తారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సిఎం సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను వివరిస్తారు. అలాగే వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి సమగ్రంగా పేర్కొంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పాల్గొంటారు.
Launch of Farmer platform October 31 in telangana