షాద్నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదుకానీ మన్నె విజయ్ అనే వ్యక్తి ఇంటి పెంట్హౌస్ పక్కన దర్జాగా సేదతీరుతూ దర్శనమిచ్చింది. పెంట్హౌస్లో పడుకున్న ఇంటి యజమాని విజయ్ ఉదయం డోర్ తీయగా, ఇంటి ముందు చిరుత ఉండడాన్ని చూసి భయంతో ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ వేసుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో వారొచ్చి చిరుతకు మత్తుమందు ఇచ్చి చాకచక్యంగా బంధించారు. చిరుతను బోనులో బంధించి హైదరాబాద్ జూకు తరలించారు. చిరుత వల్ల ఎవరికీ హానీ జరగకపోవడంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి కమాలొద్దీన్ తెలిపారు. చిరుత వయస్సు ఐదేళ్లు ఉంటుందని ఆయన చెప్పారు.. గతంలో కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ శివారు ప్రాంతంలో చిరుత సంచరించిందని ఆయన పేర్కొన్నారు. అటవీ సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.