కరోనా వైరస్ను నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీస్ శాఖ వారికి, ఆయా ప్రభుత్వాలకి మనం హర్షాతిరేకం ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిదని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి మోదీ పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనందరం జనతా కర్ఫ్యూ పాటించి ఇళ్లకే పరిమితం అవుదామని ఆయన తెలిపారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు మన గుమ్మంలోకి వచ్చి చప్పట్లతో ప్రతి ఒక్కరం సేవలందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయమిదని అన్నారు. భారతీయులుగా మనందరం ఐకమత్యంతో ఒక్కటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందామని… సామాజిక సంఘీభావం పాటిద్దామని చెప్పారు. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దామని చిరంజీవి పిలుపునిచ్చారు.