ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) ఎల్ఐసి(లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్) ఇష్యూ రానుందని ఆదివారంనాడు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐపిలో ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) రానుందని తెలిపారు. ఎల్ఐసి లిస్టింగ్ కోసం అనేక ప్రక్రియలు చేపట్టాల్సి ఉందని, కొన్ని చట్టపరమైన మార్పులు చేయాల్సి ఉందని కుమార్ అన్నారు. సంబంధిత మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉండడంతో పాటు లిస్టింగ్కు విధివిధానాలు తీసుకురావాల్సి ఉందని, ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఎల్ఐసి లిస్టింగ్ విషయంలో చాలా పారదర్శకంగా, ఈక్విటీ మార్కెట్కు అనుగుణంగా ఉంటుందని మీడియా సంస్థతో ఆయన అన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి లిస్టింగ్, ఐడిబిఐలో వాటాల విక్రయం ద్వారా రూ.90 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. 202021లో మొత్తం రూ.2.10 లక్షల కోట్లు సమీకరణ ప్రభుత్వం టార్గెట్గా ఉంది. ప్రస్తుతం ఎల్ఐసిలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండగా, ఈ ఎల్ఐసి ఇటీవల ఐడిబిఐ బ్యాంక్లో 46.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. స్టాక్ ఎక్సేంజ్ల్లోకి కంపెనీల లిస్టింగ్ సంస్థలకు క్రమశిక్షణ కల్గిస్తుందని, ఫైనాన్షియల్ మార్కెట్లకు చేరువ అయి, విలువ తెలుస్తుందని, దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల సంపద సృష్టికి అవకాశం లభిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.
అందుకే ఎల్ఐసిలో కొంత భాగాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఐపిఒకు వెళుతోందని సీతారామన్ తెలిపారు. ఎల్ఐసి పట్ల మార్కెట్ వర్గాలు చాలా ఆసక్తితో ఉన్నారని, సౌదీ ఆరాంకో మాదిరిగా దశాబ్దంలో అతిపెద్ద ఐపిఒగా అవతరించనుందని అన్నారు. 60 ఏళ్ల ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. ఈ సంస్థకు 70 శాతం మార్కెట్ వాటా ఉంది. అనేక పాలసీలలో ఈ బీమా సంస్థకు 76.28 శాతం వాటా ఉండగా, మొదటి సంవత్సరం ప్రీమియంలో 71 శాతం వాటా ఉంది. ఎల్ఐసి అనుబంధ సంస్థల్లో ఐడిబిఐ బ్యాంక్ ఉంది. గతేడాదిలో ఈ బ్యాంక్లో నియంత్రణ వాటాను ఎల్ఐసి సొంతం చేసుకుంది.