యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ సినిమా టీజర్ కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. హీరో విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా ఆదివారం ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని అభిమానులు, సినీ లవర్స్ ఆశించారు. ‘లైగర్’ చిత్రబృందానికి కూడా టీజర్ను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలోని విపత్కర పరిస్థి తులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ‘లైగర్’ సినిమా టీజర్ విడుదలను వాయిదా వేశారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు సద్దుమణిగి ప్రజలు ఆనందంగా ఉన్న తరుణంలోనే ‘లైగర్’ టీజర్ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ప్రకటనను విడుదల చేసింది. “ఆదివారం ‘లైగర్’ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ టీజర్ను విడుదల చేయాలని మేం అందరం అనుకున్నాం. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ప్రతి ఒక్కరినీ బాధ కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్న ఈ తరుణంలో ‘లైగర్’ టీజర్ను విడుదల చేయాలని అనుకోవడం లేదు.
అందుకే వాయిదా వేశాం. ఈ క్లిష్ట సమయాలు వెళ్లిపోయాక ‘లైగర్’ టీజర్ను మీ ముందుకు తీసుకువస్తాం. టీజర్ విడుదలైన తర్వాత ‘లైగర్’ చిత్రంలోని విజయ్ దేవరకొండ లుక్కి, పర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. టీజర్ విడుదల కానుందుకు ఇప్పుడు నిరుత్సాహపడ్డవారు ఆ క్షణం డబుల్ హ్యాపీతో ఉంటారు”అని ఫిల్మ్మేకర్స్ పేర్కొన్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మోహతా ఈ పాన్ ఇండియన్ సినిమాను సమిష్టిగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ‘లైగర్’ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.