Friday, April 19, 2024

ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిశా లోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోరరైలు ప్రమాదంపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీచే విచారణ జరిపించాలని కోరుతూ ఆదివారం సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుత రైల్వే వ్యవస్థలో ఉన్న రిస్క్ అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు సాంకేతిక నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి మార్గదర్శకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నివేదికను రెండు నెలల్లోగా అత్యున్నత న్యాయస్థానానికి అందేలా చూడాలని పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్ యివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ తక్షణమే అమలయ్యేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

కవచ్ అంటే …
ఈ వ్యవస్థలో సిగ్నలింగ్ వ్యవస్థతోపాటు రైలు పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. ఎప్పుడైనా ఒకే ట్రాక్‌లో రెండు రైళ్లు ప్రయాణిస్తుంటే దగ్గరకు చేరుకునే లోపే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు పడి రైళ్లు ఆగిపోతాయి. లోక్‌పైలట్ సిగ్నల్ జంప్ చేసినా, కవచ్ వ్యవస్థ దానికదే బ్రేకులు పడేలా చేస్తుంది. ట్రైన్ కొలైజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పేరుతో రైళ్లలో ప్రమాదాలను అరికట్టడానికి రూపొందించిన ఈ సాంకేతికతను 2012 లోనే అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. 2019లో బీజేపీ ప్రభుత్వం దీనికి కవచ్ అని పేరు పెట్టింది.

ఇప్పటికి 1455 కిమీ మార్గంలో , 134 రైల్వే స్టేషన్ల పరిధిలో , 77 రైళ్లలో మాత్రమే కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే మొత్తం రైల్వేలైనులో ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్నది కేవలం 2 శాతం లైన్లలో మాత్రమే. ఒక కిలో మీటరు మార్గంలో కవచ్ ఏర్పాటుకు దాదాపుగా రూ. 54 లక్షలు ఖర్చవుతుందని అంచనా. గత బడ్జెట్‌లో కేంద్రం కవచ్‌కు కేవలం రూ. 2000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు 3703 కిమీ కు మాత్రమే సరిపోతాయి. ఈ లెక్కన దేశంలోని మొత్తం రైలు మార్గాల్లో కవచ్ అందుబాటు లోకి తేడానికి మరో 20 ఏళ్లైనా పట్టవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News