Thursday, April 25, 2024

లోకల్ మంత్రం మాటవరసకేనా!

- Advertisement -
- Advertisement -

Local governance is limited to paper

 

మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది. ఈ ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానికి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రధాని ప్రకటించారు. ఈ ప్రసంగాన్ని ఆయన లోకల్ అంటూ ప్రారంభించారు, లోకల్ పేరుతోనే ముగించారు. ఆయన లోకల్ అని చెబుతున్నప్పుడు ఆయన హావభావాలు, చేతులు ఊపుతూ మాట్లాడిన వైఖరి గమనించినవారు అసలు లోకల్‌ను పక్కకు తప్పించేలా ఉన్నాయని అప్పుడే అన్నారు. భారతదేశం వంటి అతిపెద్ద దేశం, వైవిధ్యభరితమైన దేశంలో సామాజిక, ఆర్ధికమార్పులు సాధించాలంటే స్థానిక పరిపాలనా వ్యవస్థ ద్వారానే సాధ్యమని ఎవరైనా ఒప్పుకుంటారు. స్థానిక నైపుణ్యాలను, స్థానిక సముదాయాల్లోని ప్రతిభను ఒడిసిపట్టుకుని, అక్కడి ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా ప్రతిస్పందిస్తూ చర్యలు తీసుకోవడం ద్వారానే ఫలితాలు సాధించగలం.

ఒక కొత్త ప్యాకేజీ ప్రకటిస్తున్నప్పుడు స్థానిక ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడ ఎంతైనా స్వాగతించదగిన విషయం. నిజానికి స్థానిక పరిపాలన గురించి ఆలోచనలు నేటివి కావు. పాతిక సంవత్సరాలుగా ఈ ఆలోచనలున్నాయి. భారత రాజ్యాంగ సంస్కరణల్లో 73వ సంస్కరణ దీనికి సంబంధించిందే. 1992లో ఈ సంస్కరణ జరిగింది. పంచాయతీ రాజ్ చట్టం వచ్చింది. లోకల్ మంత్ర లేదా స్థానిక పరిపాలన విషయంలో ఇది గొప్ప నిర్ణయం. స్థానిక అభివృద్ధికి తగిన కార్యక్రమాలను డిజైన్ చేయడమే కాదు, అమలు విషయంలోను ఈ చట్టం ఒక ముందడుగు.

భారత రాజ్యాంగానికి చేసిన 73వ, 74వ సంస్కరణల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1992లో జరిగింది. కాని కాలం గడిచే కొద్దీ స్థానిక స్వపరిపాలన అనేది కేవలం కాగితాలకే పరిమితమయ్యిం ది. ప్రభుత్వంలోను, వివిధ విభాగాల్లోను కేంద్రీకృత వ్యవస్థకే ప్రాముఖ్యం పెరిగింది. లక్ష్యాలు, ప్రాధాన్యతలు, సమాచారం, సాధనలు, ప్రక్రియలు వీటి గురించి సమాచారం పైనుంచి క్రిందికి ప్రవహించడం ఆగిపోయింది. కేవలం ఆదేశాలు మాత్రమే కిందికి రావడం మొదలైంది. ఇప్పడు జరుగుతున్నదేమిటంటే, కేంద్రం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్ణయాలతో పాటు ఆర్ధిక ప్యాకేజీలను కూడా ప్రకటించి వాటిని కిందికి రాష్ట్రాలపైకి, జిల్లాలపైకి నెట్టేస్తున్నారు. మేనేజిమెంటు రంగంలో ఇలాంటి ఒంటెద్దు పోకడల వల్ల వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతింటాయని పలువురు విశ్లేషించారు.

ప్రభుత్వం అభివృద్ధి ప్యాకేజీలను డిజైన్ చేయడంలో, నిధులు సమకూర్చడంలో ఈ ఒంటెద్దు పోకడ వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానిక పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా తగినన్ని నిధుల కేటాయింపు జరక్కపోవడం, బాధ్యతాభావం లేకపోవడం ఇలా అనేక కారణాలవల్ల అసలు లక్ష్యమే దెబ్బతింటుంది. భారతదేశంలో ఈ సమస్యలను పరిస్కరించడానికే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం తెచ్చారు. స్ధానిక స్వపరిపాలన అనేది అభివృద్ధికి అత్యుత్తమ కార్యక్రమాలను డిజైన్ చేయడం, అమలు చేయడానికి సంబంధించింది. కాని ఇలా అధికారాలను కింది స్థాయి వరకు పంపిణీ చేయడం బ్యూరోక్రసికి నచ్చలేదు. మరోవైపు మేధావులకు కూడా ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు తెలెత్తాయి.

గమనించవలసిన విషయమేమంటే, మనం నగరాల నుంచి దూరంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన కొద్ది కుల వివక్ష, వర్గ వివక్ష బలంగా ఉన్నాయని చాలా మంది వ్యాఖ్యాల అభిప్రాయం. చాలా మంది మేధావులు కూడా ఈ విమర్శ చేస్తున్నారు. గ్రామీణ భారతదేశ ఒక శతాబ్దం వెనుక జీవిస్తుందనే అభిప్రాయమే అందరిలోనూ ఉంది. అనేక ఆర్థిక, సామాజిక అసమానలు అక్కడ రాజ్యం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, గ్రాంటులను వివిధ రంగాలకు తగిన విధంగా ఇవ్వడం ఇవన్నీ ఎన్నికైన పంచాయతీ సభ్యులకు పెద్ద సవాలుగా మారాయి. ఇలాంటి పనులు నిర్వహించే పాలనాపరమైన శిక్షణ వారికి లేదు. (నేను కర్నాటక ప్రభుత్వ ప్రణాళికా సంఘలో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు 540 స్కీములు, గ్రాంటులు కేవలం పేదవారి కోసం ఉద్దేశించినవి, ఎస్‌సి, ఎస్‌టిలకు ఉద్దేశించినవి ఉండేవి) ఇన్ని స్కీములకు కేటాయింపులు చేసి నిర్వహించడం వారికి తలకు మించిన భారమయ్యింది. పంచాయతీలకు ఈ పని చేసే సామర్థ్యం లేదని బ్యూరోక్రసీ భావించింది.

నిజానికి ఎన్నికైన పంచాయతీ సభ్యులు స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను డిజైన్ చేసి అమలు చేయవలసిన పౌరులు, అయినప్పటికీ ఈ బాధ్యత చివరకు బ్యూరోక్రసీయే స్వీకరించింది. బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి స్థాయి నుంచి డెవలప్‌మెంట్ సెక్రటరీ వరకు బ్యూరోక్రసీ మాత్రమే ఈ పనులు చేయడం ప్రారంభించిం ది. ఆవిధంగా చివరకు 73వ రాజ్యాంగ సంస్కరణను పక్కన పెట్టడం జరిగింది. ఈ విషయాన్న అర్థం చేసుకోడానికి గ్రామీణాభివృద్ధికి సంబంధించి లేదా మహిళాభివృద్ధికి సంబంధించి పదవ, పదకొండవ ప్రణాళికలను పరిశీలించవచ్చు. ఈ రెండు రంగాలే కాదు, ఏ రంగమైనా తీసుకోవచ్చు. స్థానిక స్వపరిపాలన అనేది ఎక్కడా కనబడదు. ప్రణాళికా ప్రక్రియలో కేంద్రం స్థాయిలోనే అన్ని నిర్ణయమైపోతాయి. ఆ తర్వాత నిధుల కేటాయింపులు అక్క డి నుంచి రాష్ట్రాలకు బదలాయింపులు జరుగుతాయి.

ఇక 73వ రాజ్యాంగ సవరణను గౌరవించి అమలు చేసే బాధ్యత ఇక రాష్ట్రాలపై పడుతుంది. కొంతవరకు పంచాయతీ సభ్యులకు ప్రమేయం కల్పించడం ద్వారా స్థానిక ప్రాతినిధ్యానికి అవకాశం ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే, అసలు స్కీం మొత్తం సిద్ధంగా ఉంటుంది. అందులో స్థానిక ప్రతినిధులు చేయవలసింది ఏదీ ఉండదు. నిధుల కేటాయింపులో స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా గ్రామపంచాయతీ, జిల్లా ప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలనే సూచనలు వచ్చాయి. ఈ విధంగా స్థానిక అవసరాలకు తగిన విధంగా నిధుల కేటాయింపు చేసే అవకాశాన్ని ఇవ్వాలి. ఇక్కడ కూడా చివరకు బ్యూరోక్రసీ వద్దకే సమస్య వస్తుంది. ఈ పరిస్థితుల్లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తూ ప్రధానమంత్రి లోకల్ గురించి మాట్లాడితే చాలా మందిలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. స్థానిక స్వపరిపాలనకు మంచిరోజులు వస్తాయనుకున్నారు. కాని ఆ వెంటనే ఆ ఆశలపై చన్నీళ్ళు కురిశాయి.

ఆర్ధికమంత్రిగారు స్థానికం ఇందులో ఏదీ లేదని, అన్ని సిద్ధంగా వడ్డించడానికి సిద్ధంగా వండిన వంటలే అని స్పష్టం చేశారు. స్థానిక వంటలు వండుకునే అవకాశం లేదు. కోవిడ్ 19 ఆర్ధిక ప్యాకేజీ నిజానికి ప్యాకింగ్ చేసి సిద్ధంగా ఉన్న లడ్డూల బుట్ట. అన్ని స్కీముల వివరాలు ఆర్ధికమంత్రి చెప్పారు. అన్ని నిర్ణయమైపోయాయి. ఈ స్కీముల్లో ఒకటి మైక్రో స్మాల్ మీడియం సైజ్ ఎంటర్ ప్రయిజెస్ (ఎంఎస్‌ఎంఇ) అంటే అల్ప, స్వల్ప మధ్యస్థాయి పరిశ్రమలకు సంబంధించింది. ఈ పరిశ్రమలు లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికన్నా ముందు ప్రకటించిన ఒక ప్యాకేజీలో పేదసాదలకు ఉచితంగా ఆహారధాన్యాలిస్తామన్నారు.మహిళలకు, వృద్ధులకు, రైతులకు జూన్ నెల నుంచి మూడు నెలల వరకు ప్రత్యక్ష నగదు బదిలీ ఇస్తామన్నారు. ఈ ప్యాకేజీలన్నీ కేంద్ర స్థాయిలో నిర్ణయాలు జరిగిపోయి.కేవలం అమలు చేయడానికి రాష్ట్రాలకు నిర్దేశాలిస్తున్న వ్యవహారాలే.

ప్రధానమంత్రి లోకల్ అంటున్నప్పుడు ఆయన హావభావాలు కేంద్రాన్ని సూచిస్తున్నాయని కొందరు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ప్రధాని ప్రకటించినప్పుడు స్థానిక స్వపరిపాలన గురించి తలెత్తిన చిరుఆశ ఆర్ధికమంత్రి ప్రకటనతో కొట్టుకుపోయింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, స్టేట్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, ఈయన్ను గోలీమార్ ఠాకూర్ అని కూడా ఇప్పుడు పిలుస్తున్నారు, వీరిద్దరు కలిసి 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజి ఎలా ఎన్ని స్కీముల్లో ఏవిధంగా ఎక్కడ ఖర్చవుతుందో అణాపైసల లెక్కలతో సహా చెప్పేశారు. ఇప్పుడు గోలీమార్ వ్యవహారం ఆర్ధికం కూడా అయిపోయిందా, సంపన్న ప్రైవేటు సెక్టార్ జేబుల్లోకి వెళ్ళి పడేలా ఈ స్కీములను షూట్ చేస్తున్నారా అని చాలా మంది అనుమానిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News